- Home
- International
- Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్కు చైనా హెచ్చరిక, మరో 3 రోజుల్లో
Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్కు చైనా హెచ్చరిక, మరో 3 రోజుల్లో
Nepal Floods: ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన నేపాల్ను మరో ప్రమాదం భయపెడుతోంది. ఇప్పటికే ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన వేళ.. రసువా జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఓ సరస్సు ఆందోళనకు కారణమవుతోంది.

రసువాలో కొత్త సరస్సు.. పెరుగుతున్న నీటి మట్టం
నేపాల్లోని రసువా జిల్లాలో భోటే కోషి నదీ ప్రవాహానికి సమీపంలో ఈ కొత్త సరస్సు ఏర్పడినట్లు సమాచారం. టిబెట్ ప్రాంతంలో పుట్టే చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు ముందుకు సాగుతూ పరస్పరం కలుస్తాయి. అనంతరం వాటి ప్రవాహం నేపాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ నదులు కలిసే ప్రాంతానికి సమీపంలోనే భారీగా నీరు నిలిచి సరస్సు రూపుదిద్దుకున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. గురువారం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు అంచనా వేశారు. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీటి ఒత్తిడి పెరిగి సరస్సు తెగిపోయే పరిస్థితి ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
సరస్సు తెగితే మళ్లీ వరద ముప్పు
కొత్తగా ఏర్పడిన సరస్సుకు గండి పడితే భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భోటేకోషి, త్రిశూలి నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పటికే వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ఇది మరో పెద్ద సవాలుగా మారనుంది.
పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చైనా అధికారులు సరస్సును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ గండి పడితే నీటి ప్రవాహం ఏ ప్రాంతాలపై ప్రభావం చూపవచ్చు, ఎలాంటి అత్యవసర చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
నేపాల్కు అధికారిక సమాచారం ఇచ్చిన చైనా
కొత్త సరస్సు, దాని వల్ల తలెత్తే ప్రమాదంపై చైనా ప్రభుత్వం నేపాల్కు అధికారికంగా సమాచారం అందించినట్లు నేపాల్ జల విజ్ఞాన, వాతావరణ విభాగం తెలిపింది. ఈ సమాచారాన్ని నేపాల్ విదేశాంగ శాఖకు కూడా చైనా అధికారులు తెలియజేసినట్లు పేర్కొంది. భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి అధికారిక సమాచారం వచ్చే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.
రెస్క్యూ బృందాలకు ప్రత్యేక హెచ్చరిక
ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉండటంతో సెర్చ్, రెస్క్యూ బృందాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులు, భద్రతా సిబ్బంది కూడా నదుల పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నేపాల్లో పరిస్థితి విషమంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలోనే 132 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్కు కొత్త సరస్సు రూపంలో మరో ముప్పు ఎదురవడంతో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే కొన్ని రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

