నెమ్మదిగా వెళ్తేనే త్వరగా గమ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచనను మార్చేసే కథ
Motivational Story: త్వరగా గమ్యాన్ని చేరుకోవాలంటే వేగంగా పరిగెత్తాలి. ప్రతీ ఒక్కరూ ఇలాగే భావిస్తుంటారు. కానీ అన్ని సందర్భాలకు ఇది సెట్ అవ్వదని చెప్పే ఒక మంచి మోటివేషనల్ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేగంగా వెళ్తేనే విజయం అనుకోవడం ఎంతవరకు నిజం
సాధారణంగా జీవితంలో ఏదైనా గమ్యాన్ని త్వరగా చేరుకోవాలంటే వేగంగా వెళ్లాలని అనుకుంటాం. రోడ్డుపై ప్రయాణం అయినా, చదువు అయినా, ఉద్యోగం అయినా, డబ్బు సంపాదించడం అయినా త్వరగా ఫలితం రావాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడుతున్నారు. అయితే ప్రతి విషయంలో వేగం పనిచేయదు. కొన్ని సందర్భాల్లో వేగంగా తీసుకున్న నిర్ణయాలు మనల్ని గమ్యానికి దగ్గర చేయడం కంటే మరింత దూరం చేస్తాయి. తొందరపాటు వల్ల నష్టం జరిగితే, దాన్ని సరిచేసుకోవడానికి మళ్లీ ఎక్కువ సమయం, డబ్బు, శ్రమ అవసరం అవుతుంది. ఈ విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పే కథే రాజు అనే పండ్ల వ్యాపారికి ఎదురైన అనుభవం.
కొత్త గ్రామానికి బయలుదేరిన రాజు
ఒక గ్రామంలో రాజు అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతనికి సొంతంగా ఒక ఆటో ఉండేది. ప్రతిరోజూ తన ఆటోలో పండ్లను తీసుకెళ్లి వివిధ గ్రామాల్లో జరిగే సంతల్లో విక్రయించేవాడు. కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక రోజు రామాపురం అనే కొత్త గ్రామంలో పెద్ద సంత జరుగుతుందని రాజుకు తెలిసింది. అక్కడికి వెళ్తే మంచి వ్యాపారం జరుగుతుందని భావించాడు. వెంటనే తన ఆటోలో పండ్లను నింపుకుని రామాపురం బయలుదేరాడు. అయితే ఆ గ్రామానికి వెళ్లడం రాజుకు అదే మొదటిసారి. దాంతో మార్గం సరిగ్గా తెలియలేదు. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డుపక్కన గొర్రెలను మేపుతున్న ఓ కాపరి కనిపించాడు. రాజు ఆటో ఆపి, “అన్నా.. రామాపురం ఏ వైపు ఉంటుంది?” అని అడిగాడు. గొర్రెల కాపరి ఓ వైపు చూపిస్తూ, “అటువైపు వెళ్తే రామాపురం వస్తుంది” అని చెప్పాడు. వెంటనే రాజు, “ఇక్కడి నుంచి గ్రామానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?” అని అడిగాడు. అప్పుడు ఆ కాపరి ప్రశాంతంగా, “నెమ్మదిగా వెళ్తే అరగంటలో చేరుకుంటారు. అదే వేగంగా వెళ్తే రెండు గంటలు పడుతుంది” అని చెప్పాడు.
కాపరి మాటలు విని నవ్వుకున్న రాజు
కాపరి చెప్పిన మాటలు విన్న రాజుకు ఏమీ అర్థం కాలేదు. “నెమ్మదిగా వెళ్తే అరగంట.. వేగంగా వెళ్తే రెండు గంటలా? ఇతనికి ఏమైనా పిచ్చా?” అని మనసులో అనుకున్నాడు. “వేగంగా వెళ్తేనే కదా త్వరగా చేరుకోవచ్చు. నెమ్మదిగా వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది” అని తనలో తాను నవ్వుకున్నాడు. ఆలోచన కూడా చేయకుండా ఆటో వేగాన్ని పెంచాడు. వీలైనంత త్వరగా రామాపురం చేరుకుని పండ్లను అమ్ముకోవాలని భావించాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే.. రామాపురానికి వెళ్లే దారి మొత్తం పెద్ద పెద్ద గుంతలతో నిండి ఉంది. నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాల్సిన రహదారి అది. రాజు వేగంగా ఆటో నడపడంతో గుంతల దగ్గర ఆటో ఒక్కసారిగా ఎగిరి పడసాగింది. దీంతో ఆటోలోని పండ్లు రోడ్డుపై పడిపోయాయి. రాజుకు విషయం తెలిసేలోపే చాలా పండ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి.
చివరకు కాపరి మాటల్లోని నిజం అర్థమైంది
రాజు వెంటనే ఆటో ఆపాడు. రోడ్డుపై పడిపోయిన పండ్లన్నింటినీ ఏరుకోవడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పండును జాగ్రత్తగా తీసుకుని మళ్లీ ఆటోలో సర్దాడు. అంతేకాదు.. వేగంగా వెళ్లడం వల్ల కొన్ని పండ్లు దెబ్బతిన్నాయి. వాటిని వేరుగా పెట్టుకోవాల్సి వచ్చింది. పండ్లను ఏరుకోవడం, మళ్లీ సర్దుకోవడం, ఆటోను జాగ్రత్తగా నడపడం ఇలా చాలా సమయం గడిచిపోయింది. చివరకు రామాపురం చేరుకునేసరికి దాదాపు రెండు గంటలు పట్టింది. అప్పుడు రాజుకు దారిలో కలిసిన గొర్రెల కాపరి మాటలు గుర్తొచ్చాయి. “నెమ్మదిగా వెళ్తే అరగంట.. వేగంగా వెళ్తే రెండు గంటలు” అని అతను చెప్పిన మాటల్లో ఎంత పెద్ద నిజం ఉందో రాజుకు అర్థమైంది. “నేను నెమ్మదిగా వెళ్లి ఉంటే అరగంటలోనే ఇక్కడికి చేరుకునేవాడిని. తొందరపడి వేగంగా వెళ్లడం వల్ల పండ్లన్నీ పడిపోయాయి. వాటిని ఏరుకోవడానికి, సర్దుకోవడానికి సమయం పోయింది. చివరికి రెండు గంటలు పట్టింది” అని రాజు తన తప్పును తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.
డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం..
ఈ కథ మన జీవితానికి కూడా చక్కగా సరిపోతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదించే విషయంలో చాలామంది త్వరగా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు. కానీ సంపద సృష్టించడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. సరైన మార్గాన్ని ఎంచుకుని, ఓపికగా ముందుకు సాగితేనే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చదువులో మంచి ఫలితాలు రావాలంటే క్రమంగా నేర్చుకోవాలి.
ఉద్యోగంలో ఎదగాలంటే అనుభవం సంపాదించాలి. వ్యాపారంలో విజయం సాధించాలంటే మార్కెట్ను అర్థం చేసుకుని అడుగులు వేయాలి. డబ్బు సంపాదించాలంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. వేగం ఎప్పుడూ విజయానికి దారి చూపదు. సరైన దిశలో వేసే నిదానమైన అడుగులే మనల్ని గమ్యానికి చేర్చుతాయి. రాజు కథలోని అసలైన సందేశం ఇదే. గమ్యం త్వరగా చేరుకోవాలని తొందరపడటం కంటే, దారిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ముందుకు సాగడం ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు నెమ్మదిగా వేసే అడుగులే మనల్ని వేగంగా గమ్యానికి చేరుస్తాయి.

