- Home
- National
- Global Air Power Ranking: చైనాకి మైండ్ బ్లాక్.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్గా భారత్ రికార్డ్
Global Air Power Ranking: చైనాకి మైండ్ బ్లాక్.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్గా భారత్ రికార్డ్
Global Air Power Ranking 2026: డ్రాగన్ కంట్రీకి భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ 2026లో చైనాను వెనక్కి నెట్టి భారత వైమానిక దళం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. నంబర్ కాదు పవర్ ముఖ్యమని ఐఏఎఫ్ నిరూపించింది.

గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ 2026.. చైనాను వెనక్కి నెట్టిన భారత్
గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ 2026లో భారత వైమానిక దళం (IAF) తన సత్తా చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్వతంత్ర వైమానిక దళాల జాబితాలో భారత్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పొరుగున ఉన్న చైనా వైమానిక దళాన్ని భారత్ వెనక్కి నెట్టేసింది. కేవలం విమానాల సంఖ్యపైనే ఆధారపడకుండా ఆధునిక సాంకేతికత, సామర్థ్యాలపై దృష్టి పెట్టడమే భారత్ సాధించిన ఈ విజయానికి ప్రధాన కారణం.
69.4 స్కోరుతో దూసుకెళ్లిన ఐఏఎఫ్
గ్లోబల్ ఎయిర్ పవర్ మూల్యాంకనంలో భారత వైమానిక దళం 69.4 ట్రూ వ్యాల్యూ రేటింగ్ సాధించింది. అన్ని సైనిక విమానయాన విభాగాలను కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఐఏఎఫ్ 6వ స్థానంలో నిలిచింది. కానీ స్వతంత్ర వైమానిక దళాల విషయానికి వస్తే చైనాను దాటి 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఫ్లీట్ సమతుల్యత, ఆయుధాల ఆధునికీకరణ, యుద్ధానికి సదా సిద్ధంగా ఉండే కార్యాచరణ వైఖరి వల్లే భారత్కు ఈ భారీ స్కోరు లభించింది.
63.8 రేటింగ్కే పరిమితమైన చైనా
ఈ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో చైనా వైమానిక దళం 63.8 రేటింగ్తో 4వ స్థానానికి పడిపోయింది. భారత వైమానిక దళం కంటే చైనా స్పష్టంగా వెనుకబడిపోయింది. కేవలం పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు ఉన్నంత మాత్రాన గగనతలంలో ఆధిపత్యం సాధించలేరని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది. గ్లోబల్ మూల్యాంకనం మొత్తం విమానాల సంఖ్య కంటే వాటి పనితీరు, సామర్థ్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
నైపుణ్యాన్ని నిరూపించిన 5.6 పాయింట్ల వ్యత్యాసం
భారత్ సాధించిన 69.4 స్కోరుకు, చైనా సాధించిన 63.8 స్కోరుకు మధ్య 5.6 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. ఈ గ్యాప్ భారత వైమానిక దళం అత్యుత్తమ నైపుణ్యాన్ని నిరూపిస్తోంది. ఈ గ్లోబల్ రేటింగ్ వ్యవస్థ విమానాల సంఖ్యతో పాటు ఆధునికీకరణ, లాజిస్టికల్ సపోర్టును సమగ్రంగా అంచనా వేస్తుంది. వైమానిక దళాల రక్షణ సామర్థ్యాలు, నైపుణ్యం, సాంకేతికత కలయికను బట్టి రేటింగ్లు కేటాయిస్తారు.
సమతుల్యతే భారత్కు కొండంత బలం
యుద్ధ విమానాలు, రవాణా విమానాలు సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడు పైలట్లకు సరైన శిక్షణ, మెరుగైన నిర్వహణ సాధ్యమవుతుంది. భారత వైమానిక దళంలో అధునాతన యుద్ధ విమానాలతో పాటు రవాణా యూనిట్ల సమ్మేళనం ఎంతో అద్భుతంగా ఉంది. నిరంతరం కొత్త యుద్ధ విమానాలు, అధునాతన హెలికాప్టర్లను చేర్చుకోవడం వల్ల భారత్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటోంది. ఉన్న విమాన దళాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా దేశానికి బలమైన రక్షణ కవచం లభిస్తోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి మరిన్ని యుద్ధ విమానాలు
భారత్ ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రచిస్తుండటంతో, సమీప భవిష్యత్తులో భారత వైమానిక దళం (IAF) స్క్వాడ్రన్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఐఏఎఫ్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకరంగా 29కి పడిపోయింది.
ఇప్పటికే 40 తేజస్ మార్క్-1 విమానాలు వినియోగంలో ఉండగా, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుంచి మొత్తం 180 4.5వ తరం తేజస్ మార్క్-1A జెట్ల కోసం ఐఏఎఫ్ ఒప్పందం చేసుకుంది. రాబోయే ఏళ్లలో రఫేల్, తేజస్ మార్క్-1A విమానాలు తోడవ్వడంతో, ఐఏఎఫ్ ఫైటర్ ఫ్లీట్ పోరాట పటిమ పెరగడమే కాకుండా వాటి సంఖ్య కూడా పెరుగుతుంది.
మరోవైపు భారత్ 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA)పై కూడా పనిచేస్తోంది. 2029 తర్వాత వీటిని వైమానిక దళంలో చేర్చడం ప్రారంభించే అవకాశం ఉంది. 2030 నాటికి దాదాపు 200కి పైగా జగ్వార్, మిరాజ్ 2000, మిగ్-29 ఫైటర్ విమానాలు ఫేజ్ అవుట్ ముగించుకోనున్న నేపథ్యంలో... రఫేల్, తేజస్ మార్క్-1A, ఏఎంసీఏల చేరిక దేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యంగా మారింది.

