- Home
- National
- India First Electric Flying Taxi: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. భారత్లో తొలి ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ టాక్సీ ఇది !
India First Electric Flying Taxi: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. భారత్లో తొలి ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ టాక్సీ ఇది !
India First Electric Flying Taxi: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ తయారు చేసిన భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ e200X ఆవిష్కరణ జరిగింది. ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు మీకోసం.

పైలట్ లేకుండా ఎగిరే ఎయిర్ టాక్సీ వచ్చేసింది
సిటీలో రోడ్డెక్కితే చాలు.. అడుగు ముందుకు పడని ట్రాఫిక్ జామ్.. గంటల కొద్దీ సిగ్నల్స్ దగ్గర వేచి చూడాల్సిన పనిలేదు ఇకపై. ఈ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే శుభం కార్డ్ పడబోతోంది. భారతీయ నగరాల్లో ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసేందుకు ఆకాశ మార్గం సిద్ధమవుతోంది. చెన్నైలోని ఐఐటీ మద్రాస్కు చెందిన స్టార్టప్ 'ది ఈప్లేన్ కంపెనీ' (The ePlane Company) భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ 'e200X - PT01' ఫుల్-స్కేల్ ప్రోటోటైప్ను ఆవిష్కరించింది.
ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్లో కొత్తగా ఏర్పాటు చేసిన 60,000 చదరపు అడుగుల తయారీ యూనిట్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ను అన్వేల్ చేశారు. ఇది నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించడమే కాకుండా, భారతీయ విమానయాన రంగ రూపురేఖలనే మార్చేయనుంది.
హెలికాప్టర్ లాగా పైకి.. విమానంలా దూసుకెళ్తుంది
ఈ ఫ్లైయింగ్ టాక్సీ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది హెలికాప్టర్ లాగా నిలువుగా పైకి లేవగలదు. గాల్లోకి లేచాక మామూలు విమానంలా వేగంగా ప్రయాణిస్తుంది. దీని ల్యాండింగ్, టేకాఫ్ కోసం పెద్ద ఎయిర్పోర్టులు అక్కర్లేదు. బాస్కెట్బాల్ కోర్ట్లో సగం పరిమాణం, అంటే కేవలం 8x11 మీటర్ల స్థలం ఉంటే సరిపోతుంది. అంటే నగరాల్లో కొత్తగా ఎయిర్ పోర్టులు కట్టాల్సిన పనిలేకుండానే, ఆస్పత్రుల మేడలపై లేదా ఉన్న హెలిప్యాడ్లపై దీనిని ల్యాండ్ చేయవచ్చు.
రేంజ్ ఎంత? భద్రత ఎలా ఉంది?
ఈ ఎయిర్క్రాఫ్ట్ బరువు సుమారు 2.2 టన్నులు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ముంబై నుంచి పూణే లేదా చెన్నై నుంచి పుదుచ్చేరి వంటి దూరాలను నిమిషాల్లోనే చేరుకోవచ్చు. భద్రత విషయంలో కంపెనీ రాజీ పడలేదు. ఇందులో 6 లిఫ్ట్ రోటర్లు, 4 ఫార్వర్డ్ ప్రొపెల్లర్లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఏ కారణం చేతనైనా ఒక మోటార్ లేదా రెక్క పాడైనా, మిగిలిన రెక్కలు విమానాన్ని సురక్షితంగా నిలబెట్టి కంట్రోల్ చేస్తాయి.
మొదట ఎయిర్ అంబులెన్స్గానే సేవలు
ఈప్లేన్ కంపెనీ ఫౌండర్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఎయిర్ టాక్సీని ముందుగా ఎయిర్ అంబులెన్స్గా ఉపయోగిస్తారు. ట్రాఫిక్ ప్యాక్ అయిపోయే అత్యవసర సమయాల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి నిమిషాల్లో చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాతే సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తారు. ఇందులో ఒక పైలట్తో పాటు 200 కిలోల వరకు పేలోడ్ను తీసుకెళ్లవచ్చు.
తొలి ప్రయాణంలో పైలట్ ఉండరు.. ఎందుకంటే?
కఠినమైన భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభ టెస్ట్ ఫ్లైట్స్ను పైలట్ లేకుండానే నిర్వహించనున్నారు. అడ్వాన్స్డ్ 'ఫ్లై-బై-వైర్' టెక్నాలజీ వల్ల పైలట్ లేకుండా టెస్ట్ ఫ్లైట్స్ చేయడం పూర్తి సేఫ్ అని ప్రొఫెసర్ చక్రవర్తి చెప్పారు. ఎయిర్క్రాఫ్ట్ అన్ని రకాల భద్రతా పరీక్షల్లో నెగ్గే వరకు అందులో మనుషులను కూర్చోబెట్టరు.
కమర్షియల్ లాంచ్ ఎప్పుడు?
ఇండిగో మాజీ ప్రెసిడెంట్, ఈప్లేన్ బోర్డు మెంబర్ ఆదిత్య ఘోష్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ టెస్టింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. ఇక ఫ్లయింగ్ టెస్టింగ్ 2027 రెండో త్రైమాసికం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డీజీసీఏ (DGCA) నుంచి అన్ని అనుమతులు వచ్చాక, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దీనిని కమర్షియల్గా మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ కంపెనీకి ఇప్పటికే 800కు పైగా ఎయిర్క్రాఫ్ట్ల ఆర్డర్లు రాగా, ఇన్వెస్టర్ల నుంచి 21.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.

