- Home
- Entertainment
- MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
MS Subbulakshmi: భరతదేశం గర్వించదగ్గ గాయనీమణుల్లో ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి ఒకరు. మరణించి 20 ఏళ్లు దాటినా.. ఆమధుర గాయనిని మర్చిపోలేదు శ్రోతలు. వారికోసం ఎమ్మెస్ బయెపిక్ త్వరలో అలరించనుంది. ఈ క్రమంలో సుబ్బులక్ష్మి జీవితం, రికార్డుల గురించి తెలుసుకుందాం.

మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి
మహా గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి) భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపై నిలిపి, సరికొత్త శకానికి నాంది పలికారు. ఆమె బాల్యం, సినీ ప్రస్థానం, సాధించిన ఘనతలు ,సంగీత ప్రపంచంలో నెలకొల్పిన సరికొత్త రికార్డులు మరెవరికి సాధ్యం కావు. అటువంటి అద్భుత గాయని గురించి తెలుసుకునే పరయత్నం చేద్దాం.
1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, చిన్నతనంలోనే తల్లి షణ్ముగవడివు (వీణా విద్వాంసురాలు) వద్ద సంగీత సాధన ప్రారంభించారు. 13వ ఏటనే మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తన తొలి కచేరీ చేసి పండితులను సైతం మెప్పించారు. 'సేవాసదనం', 'శాకుంతలై', 'సావిత్రి' వంటి చిత్రాలలో పాటలు పాడి.. గాయనిగా నిరూపించుకున్నారు. 1945లో వచ్చిన 'మీరా' సినిమాలో ఆమె నటన, పాడిన భజనలు దేశవ్యాప్తంగా భాషా సరిహద్దులను చెరిపేసి విశేష ప్రజాదరణ పొందాయి.
తిరగరాయలేని ఘనతలు ఎన్నో..
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఖాతాలో ఎన్నో రికార్డులు పదిలంగాఉన్నాయి. వాటిని ఎవరు చెరిపివేయలేరు. అందులో కొన్ని చూసుకుంటే.. ఐక్యరాజ్యసమితిలో గానం చేసిన తొలి భారతీయురాలు ఎమ్ఎస్ ది చెరిపివేయలేని రికార్డుగా నిలిచిపోయింది. 1966లో ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన కచేరీ చేసిన మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలు సుబ్బులక్ష్మి. అంతే కాదు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు (1998) కూడా ఆమెనే. ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డు అందుకున్న తొలి భారతీయ గాయకురాలుగా ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మికి ప్రత్యేకరికార్డు ఉంది. అంతే కాదు ప్రతిష్టాత్మక లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో కచేరీ నిర్వహించిన మొదటి భారతీయ కళాకారిణిగా గా ఆమె నిలిచారు.
తిరుమలలో నిత్యం వినిపించే స్వరం..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసురాలిగా సేవలు అందించిన సుబ్బులక్ష్మి ఆమె గాత్రంలో వెలువడిన 'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం' ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉదయాలకు కేంద్రబిందువుగా మారింది. విష్ణు సహస్రనామం, భజ గోవిందం, కంటికి నిద్రరాదు వంటి సంకీర్తనలు ఆమె అమృత గాత్రం ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి మరణించి 20 ఏళ్లు పైనే అయినా.. ఆమె గాత్రం తిరుమల కొండపై ఇప్పటికీ సుప్రభాతంగా ధ్వనిస్తూనే ఉంది. తిరుమలలో మాత్రమే కాదు.. ఉదయాన్నే సుప్రభాతం వినే ప్రతీ ఒక్కరి ఇంట ఆమె గాత్రం జీవంతోనే ఉంది.
ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నో..
ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మిని ఎన్నో గొప్ప అవార్డులు వరించాయి. అందులో భారతరత్నతో పాటు అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ ను1954 లో, 1975 లో పద్మ విభూషన్ ను భారత ప్రభుత్వం అందించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుండి 1968లో సంగీత కళానిధి (తొలి మహిళ) అవార్డును అందుకున్నారు ఆమె. రామన్ మెగసెసే అవార్డును 1974 లో అందుకున్నారు.
ఇక సుబ్బులక్ష్మి.. కేవలం గాయనిగానే కాక, సమాజ సేవలోనూ అగ్రగామిగా నిలిచారు. ఆమె నిర్వహించిన స్వచ్ఛంద కచేరీల (Charity Concerts) ద్వారా వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆసుపత్రులు, విద్యాసంస్థలకు విరాళంగా ఇచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి మహనీయులు ఆమె గాత్రానికి అభిమానులుగా మారారు. నెహ్రూ గారు ఆమెను చూసి "సంగీత ప్రపంచానికి ఈమె మహారాణి" అని ప్రశంసించారు.
వెండితెరపై సుబ్బులక్ష్మి జీవితం..
ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ బయోపిక్లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా ఆమె కనిపించనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్నారు.

