- Home
- Entertainment
- Movie Reviews
- Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Pithapuramlo Ala Modalaindi Review: రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `పిఠాపురంలో అలా మొదలైంది`. టైటిల్తోనే బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే?

పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ
రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారులుగా `పిఠాపురంలో అలా మొదలైంది` అనే సినిమాలో నటించారు. దీనికి మహేష్ చంద్ర దర్శకుడు కావడం విశేషం. ఇందులో కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. నేడు శుక్రవారం ( సెప్టెంబర్ 18న ) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
పిఠాపురంలో అలా మొదలైంది మూవీ కథ ఇదే
పిఠాపురంలో ఊరి ప్రెసిడెంట్గా వీర రాఘవయ్య(రాజేంద్రప్రసాద్)నే దాదాపు 20ఏళ్లుగా ఎన్నుకుంటారు అక్కడి ప్రజలు. ఆయన చేసే మంచి ఆ స్థాయిలో ఉంటుంది. ఆయనకు బంగారయ్య(30 ఇయర్స్ పృథ్వీ), విశ్వనాథ్(కేదార్ శంకర్) స్నేహితులు. బంగారయ్య ఊర్లో బాగా రిచ్. అమ్మాయిల పిచ్చి. స్టేటస్ కోసం ఎంత ఖర్చు అయినా పెడతాడు. విశ్వనాథ్ స్కూల్ టీచర్. మరీ స్ట్రిక్ట్. అది ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, ఆయనంటే అందరికి భయం. వీర రాఘవయ్యకి, బంగారయ్యకి, విశ్వనాథ్కి కూతుర్లుంటారు. వీరి పేర్లు అంజని(ప్రత్యూష పనస), కీర్తి(షేక్ రెహానా), గీత(శ్రీలు). ఈ ముగ్గురు క్లాస్మేట్స్. రాఘవయ్య తన కూతురుని మంచి చెడు చెబుతూ పెంచుతాడు. మార్కులు, ర్యాంకులే ముఖ్యం కాదు, నాలెడ్జ్ ముఖ్యమంటాడు. బంగారయ్య.. తన కూతురు బాగా రిచ్గా, లగ్జరీగా ఉండాలని కోరుకుంటాడు. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తాడు. దీంతో ఆమె లగ్జరీకి అలవాటు పడుతుంది. చెడుదారులు ఎంచుకుంటుంది.
ఇక విశ్వనాథ్ మరీ స్ట్రిక్ట్ కావడంతో కూతురుకి 95శాతం మార్కులు వచ్చినా కూడా వంద శాతం రాలేదని వేదిస్తుంటాడు. దీంతో ఆమె ప్రేమ ఆప్యాయత పంచిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కీర్తి.. స్టయిలీష్గా బైక్ నడిపిన కుర్రాడితో లేచిపోతుంది. కానీ అంజని మాత్రం తండ్రి అడుగు జాడలో పెరుగుతుంది. ఆమె కూడా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ దాన్ని పెద్దలకు చెబుతుంది. మరి అంజని ప్రేమని రాఘవయ్య ఎలా తీసుకున్నాడు? పెళ్ళి చేశాడా? నో చెప్పాడా? పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ వల్ల గీత, కీర్తి ఎలాంటి తప్పులు చేశారు? వారి లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి కూతురుని పెంపకంలో ఇచ్చిన సందేశం ఏంటి? అనేది సినిమా.
పిఠాపురంలో అలా మొదలైంది మూవీ విశ్లేషణ
నేటి ప్రపంచంలో పిల్లల్ని, ముఖ్యంగా కూతుళ్లని ఎలా పెంచాలనే పాయింట్ని బేస్ చేసుకొని రూపొందిన చిత్రమిది. మహేష్ చంద్ర దీన్నొక ఫ్యామిలీ ఎంటైర్టైనర్గా రూపొందించారు. తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్ని ఆవిష్కరించారు. అతి గారాబం, అతి స్వేచ్ఛ ఎలాంటి అనర్థాలను తీసుకొస్తుందనేది, అదే సమయంలో అతి కఠినం ఎలాంటి నష్టాలకు కారణమవుతుంది. ఈ తీరు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే పాయింట్ని, సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. పాయింట్ బాగుంది, కానీ సినిమాగా తెరపై ఆవిష్కరించిన తీరే ఆకట్టుకునేలా లేదు. మేకింగ్ క్వాలిటీ లేదు. అదే సమయంలో డైరెక్షన్ పరంగానూ క్వాలిటీ మిస్ అయ్యింది. ఇరవై ముప్పై ఏళ్లనాటి స్టయిల్ స్క్రీన్ప్లేతో దీన్ని తెరకెక్కించారు.
ప్రారంభం నుంచి సినిమా ఓవర్ డ్రామాగా సాగుతుంది. ప్రతి సీన్ ఆర్టిఫీషియల్గా ఉంది. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. సీన్లల్లో సహజత్వం లేదు. దీనికితోడు సాగదీసినట్టుగా ఉంది. ప్రతిదీ డిటెయిలింగ్గా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇది సీరియల్ని తలపిస్తుంది. పైగా మంచికి మరోపేరు అనేలా వీరరాఘవయ్య పాత్రని ఎస్లాబ్లిష్ చేశారు. అందులోనూ డ్రామా పండలేదు. నాటకీయత ఎక్కువగా ఉంటుంది. సినిమాలో మెయిన్గా ఒక ఎమోషన్ మిస్ అయ్యింది. సీన్లు ఏమాత్రం పండలేదు. వాటిని ఆడియెన్స్ కి కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా ఏదైనా, దాని తాలుకూ సోల్, ఎమోషన్, ఫీల్ క్యారీ అవ్వాలి, అది ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆడియెన్స్ సినిమాలో లీనమవుతారు. ఆయా పాత్రలతో జర్నీ చేస్తారు. అవి పండలేదంటే తెరపై సీన్లు మాత్రమే, ఇంకా చెప్పాలంటే బొమ్మలు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిలో జీవం ఉండదు. ఈ మూవీని చూస్తుంటే అదే ఫీలింగ్ కలుగుతుంది.
మధ్యలో పిఠాపురం గొప్పతనం, పవన్ కళ్యాణ్ గొప్ప తనం చెప్పే సీన్ మరీ ఇరికించినట్టుగా ఉంది. చూడ్డానికి కూడా అది ఓవర్గా ఉంది. ఫస్టాఫ్ బోరింగ్గా సాగుతుంది. అక్కడక్కడే తిరుగుతుంది. మరోవైపు సెకండాఫ్ ముగ్గురు అమ్మాయిల పాత్రల తాలుకూ తప్పులను చూపించారు. వారు మోసపోయిన తీరుని ఆవిష్కరించారు. ఆయా సీన్లు సాగదీసినట్టుగా ఉంటాయి. చివర్లో మాత్రం ఎమోషన్స్ క్యారీ అయ్యింది. పిల్లలు, తల్లిదండ్రులు తాము చేసిన తప్పులు తెలుసుకునే సీన్లు భావోద్వేగంగా ఉంటాయి. క్లైమాక్స్ మాత్రమే ఈ మూవీకి ప్లస్ గా చెప్పొచ్చు.
పిఠాపురంలో అలా మొదలైంది మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
రాజేంద్రప్రసాద్ వీర రాఘవయ్య పాత్రలో ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచారు. తనదైన నటనతో మెప్పించారు. ఊరికే కాదు, సినిమాకి పెద్దగా నిలిచారు. కాకపోతే ఆయన పాత్రలోని డ్రామా కొంత డోస్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇక మాస్టర్గా కేదార్ శంకర్ ఓకే అనిపించారు. చాలా చోట్ల ఆయన పాత్ర తీరుతెన్నులు అసహజంగా అనిపిస్తాయి. పృథ్వీ తన బంగారయ్య పాత్రలో ఒదిగిపోయి నటించాడు. పిల్లలుగా అంజనిగా ప్రత్యూష, కీర్తిగా రెహానా, గీతగా శ్రీలు సైతం మెప్పించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. అయితే నటీనటులనుంచి సహజమైన నటనని రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయారనిపిస్తుంది.
టెక్నీకల్గా
జీసీ క్రిష్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. విజువల్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. బి సత్యనారాయణ ఎడిటింగ్ ఫర్వాలేదు. కాకపోతే సీన్కి సీన్కి లింక్ కుదరలేదు. దర్శకుడు మహేష్ చంద్ర ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది, దాన్ని ఈ ట్రెండ్కి తగ్గట్టుగా తీయడంలో, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. కూతురుని ఎలా పెంచాలనే విషయం సందేశాత్మకంగా చెప్పాలనుకున్నా, ఆయన చెప్పిన తీరుతో ఆ సందేశం తేలిపోయింది.
ఫైనల్గా:
సీరియల్ని తలపించే `పిఠాపురంలో అలా మొదలైంది`. బోరింగ్ ఫ్యామిలీ డ్రామా.
రేటింగ్: 1.5

