- Home
- Telangana
- Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

నాలుగు రోజులు కుండపోత వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ సడన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గత కొద్ది రోజులుగా ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఉపశమనం లభించబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఫామ్ అయి, అది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో ఇప్పటివరకు ఉన్న లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో వర్షాల తీవ్రత రోజురోజుకూ పెరగనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు ఐఎండీ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఐటీ ఉద్యోగులకు అర్లీ లాగౌట్.. వర్క్ ఫ్రమ్ హోమ్
హైదరాబాద్లో భారీ వర్ష సూచనతో పాటు గణేష్ నిమజ్జన వేడుకలు, ఊరేగింపులు ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడతల వారీగా ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రద్దీ తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరారు. అలాగే వర్షాల కష్టాలు తప్పుకోవడానికి విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బెటర్ అని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ పై తుపాను ముప్పు
ఉత్తర థాయ్లాండ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 21 లేదా 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 నాటికి ఇది ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ తెలిపింది. అయితే ఈ వాయుగుండం మరింత బలపడి 'అర్నాబ్' తుపానుగా మారే ఛాన్స్ ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీని ఎఫెక్ట్తో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
వాతావరణంలో మార్పులతో జాగ్రత్త
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండ తీవ్రతతో నెల్లూరులో ఏకంగా 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ అల్పపీడనంతో ఒక్కసారిగా వాతావరణం కూల్ కానుంది. అరేబియా సముద్రంలోని అల్పపీడనం, బంగాళాఖాతంలో రాబోయే తుపాను పరిణామాలతో తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లోనూ రానున్న వారం రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

