- Home
- Entertainment
- Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Rashmika Mandanna: భారత రత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్ రాబోతోంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్
భారతీయ సంగీత ప్రపంచంలో దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ బయోపిక్లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా ఆమె కనిపించనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా
ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి గొంతు మన దేశ ఆత్మలో ఒక భాగం. ఆమె సంగీతం భాష, ప్రాంతం, తరాలకు అతీతంగా ఎదిగింది. ఆమె గాత్రం కోట్లాది మంది భక్తికి ప్రతీకగా నిలిచింది. ఆమె భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా, ఆ సంగీతం ఇంకా ఇళ్లు, గుళ్లు, కచేరీల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
ఈ రోజు ఆ అద్భుతమైన ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని, భారతీయ శాస్త్రీయ సంగీతంతో విడదీయరాని బంధం ఉన్న చెన్నైలోని 'ది మ్యూజిక్ అకాడమీ'లో ఈ బయోపిక్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
అంత సులువైన విషయం కాదు..
ఇంతటి గొప్ప లెజెండ్ను వెండితెరపైకి తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. దీని వెనుక ఎంతో శ్రమ, ఓపిక ఉన్నాయి. ఆమె కథను అంతే నిజాయితీగా, గౌరవంగా చూపించడానికి కావాల్సిన హక్కులు, అనుమతులు, ఆధారాలు, కుటుంబ సభ్యుల అంగీకారం కోసం చిత్ర బృందం ఏళ్ల తరబడి కష్టపడింది.
ఎంఎస్ సుబ్బులక్ష్మి గొప్ప జీవితాన్ని, ఆమె వారసత్వాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేర్చాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాసు లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు చేతులు కలిపారు. గౌతమ్ తిన్ననూరి తనదైన శైలిలో ఈ స్ఫూర్తిదాయకమైన కథను తెరకెక్కించనున్నాడు. పీఆర్వో: ఆతిరా దిల్జిత్.
ఎంఎస్ పాత్రకు రష్మిక మందన్న న్యాయం చేయగలదా?
ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం రష్మిక మందన్న. ఎంఎస్ సుబ్బులక్ష్మి లాంటి ఒక లెజెండరీ పాత్రను పోషించే బాధ్యతను ఈ తరం స్టార్ హీరోయిన్ రష్మిక తీసుకుంది. ఆ అద్భుతమైన గాత్రం వెనుక ఉన్న ఒక సాధారణ మహిళ భావోద్వేగాలు, కోరికలు, కష్టాలు, ఆమె ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రష్మిక తన నటనతో చూపించనుంది.

