- Home
- Andhra Pradesh
- 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం, ఎవరైనా డబ్బులు అడిగితే
50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం, ఎవరైనా డబ్బులు అడిగితే
Pension: ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్నదానిపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు.

50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 84 వేల మందికిపైగా చేనేత కార్మికులకు పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా అర్హత సాధించిన నేతన్నలకు కూడా పింఛన్లు అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులైన వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త పింఛన్ల కోసం 16,521 దరఖాస్తులు
కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,521 దరఖాస్తులు వచ్చినట్లు చేనేత, జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో శనివారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి సవిత అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల సంఖ్య, వాటి పరిశీలన ప్రక్రియ, నేతన్నల సేవలో పథకం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
నేతన్నల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన పేరుతో శ్రీసత్యసాయి, అనంతపురం సహా పలు జిల్లాల్లో కొందరు ఉద్యోగులు చేనేత కార్మికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నేతన్నలకు ఆర్థికంగా మేలు చేయాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఉచిత విద్యుత్, నేతన్నల సేవలో పథకం వంటి కార్యక్రమాలతో పాటు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు అందించే నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొందరు ఉద్యోగులు అక్రమ వసూళ్లతో నీరుగార్చడం సహించబోమని హెచ్చరించారు. దరఖాస్తుల పరిశీలనలో చేతివాటానికి పాల్పడినా, పింఛన్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
శ్రీసత్యసాయి జిల్లాలో కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన సమయంలో ఇద్దరు ఉద్యోగులు నేతన్నల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మంత్రి సవితకు ఫిర్యాదులు అందాయి. తమ అనుమతులతోనే పింఛన్లు మంజూరవుతాయని చెబుతూ డీవో రమణారెడ్డి, ఏడీవో శీనా నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన మంత్రి సవిత, ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగిస్తున్న ఇద్దరు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కమిషనర్ రేఖారాణి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలలో అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
అర్హులందరికీ పింఛన్లు.. నేతన్నలు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు
రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ పింఛన్లు అందిస్తామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పింఛన్ల మంజూరు విషయంలో చేనేత కార్మికులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. ప్రభుత్వ పథకం కింద పింఛన్ పొందేందుకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అర్హత ఉన్న ప్రతి నేతన్నకు ప్రభుత్వం పింఛన్ అందిస్తుందని, మధ్యవర్తులకు లేదా అధికారులకు డబ్బులు ఇవ్వవద్దని తెలిపారు. అర్హుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న సర్వేలో రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాల్లో పర్యటించి స్వయంగా పాల్గొనాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రతి దశలో పారదర్శకత పాటించాలని, నిజమైన అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

