Kitchen Hacks: వర్షాకాలంలో పప్పులు, బియ్యం పాడైపోతున్నాయా? ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే చాలు
Kitchen Hacks: వర్షాకాలంలో పప్పులు, పిండి, బియ్యం లాంటివి తొందరగా పాడైపోతుంటాయి.కొన్నింటికి పురుగులు పట్టేస్తే.. మరి కొన్నింటికి బూజు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
కిచెన్ హ్యాక్స్...
వర్షాకాలంలో వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఈ తేమ కారణంగా పిండి, పప్పులు, బియ్యం, ఉప్పు, పంచదార లాంటివి తొందరగా పాడైపోతూ ఉంటాయి. తొందరగా పురుగులు పట్టేస్తాయి.దీంతో.. వాటిని ఇంట్లో ఉంచుకోలేక, పారేయలేక తిప్పలు పడుతూ ఉంటాం. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మీ ఇంట్లో సరుకులు పాడవ్వకపోగా.. తాజాగా ఉంటాయి. ఆ చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం..
1.బిర్యానీ ఆకు వేస్తే చాలు...
వర్షాకాలంలో, పప్పు ధాన్యాలు, పిండిలోని తేమ కారణంగా పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా పురుగులు పట్టకుండా ఉండాలంటే పప్పులు, పిండ్లు ఉండే డబ్బాల్లో మీరు మూడు నుంచి 4 బిర్యానీ ఆకులు వేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులు, పిండిలకు పురుగులు పట్టవు. తాజాగా ఉంటాయి.
2.బియ్యంలో ఎండుమిరపకాయలు, అగ్గి పుల్లలు..
బియ్యంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల.. చిన్న చిన్న పురుగులు పడతాయి. వాటిని ఏరి.. అన్నం వండటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. మీ బియ్యం డబ్బాలో ఎండు మిరపకాయలు, అగ్గి పుల్లలు వేస్తే చాలు. పురుగులు ఉంటే పోతాయి. అయితే.. అగ్గి పుల్లలు బియ్యంలో వేస్తే.. ఆ బియ్యాన్ని అన్నం వండేటప్పుడు కనీసం రెండు, మూడుసార్లు అయినా శుభ్రం చేయాలి.
లేదంటే.. ఈ ఒక్క పొడితో కూడా బియ్యంలో పురుగులు లేకుండా చేయచ్చు. బియ్యం, పప్పుల్లో పురుగులు పోగొట్టడానికి లవంగాలు, దాల్చిన చెక్క, కర్పూరం ఉంటే చాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మూడు కర్పూరం బిళ్లలు పొడి చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి వస్త్రంలో వేసి మూట గట్టాలి. ఇప్పుడు ఈ మూటను మీరు బియ్యం, పప్పుల డబ్బాలో వేస్తే సరిపోతుంది. ఈ వాసనకు పరుగులు ఉన్నా పోతాయి. అంతేకాకుండా.. భవిష్యత్తులో పురుగులు కూడా పట్టవు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
3.ఉప్పు, పంచదార డబ్బాల్లో..
వర్షాకాలంలో తేమ కారణంగా.. ఉప్పు, పంచదార, కాఫీ లాంటివి నీరు కారినట్లుగా మారిపోతాయి. అలా అవ్వగుండా ఉండాలంటే.. ఒక చిన్న మూటలో బియ్యం వేసి.. ఆ మూటను ఈ డబ్బాల్లో వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే.. తేమ పోయి పొడిగా మారతాయి.
4.బిస్కెట్లు మెత్త పడకుండా ఉండేందుకు..
వర్షాకాలంలో బిస్కెట్లు, కుకీలు తొందరగా మెత్తగా మారిపోతాయి. అలా అవ్వగుండా ఉండేందుకు బిస్కెట్ల డబ్బాలో.. కొంచెం పంచదార వేస్తే సరిపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో బిస్కెట్లు పెట్టి.. పంచదార చల్లితే.. అవి మెత్తపడకుండా కరకరలాడతాయి.
4.పంచదారకు చీమలు పడితే...
మీ పంచదార డబ్బాలో తరచుగా చీమలు పడుతుంటే.. అందులో 4 నుంచి 5 లవంగాలు వేయాలి. లవంగాల ఘాటు వాసనకు చీమలు దూరంగా ఉంటాయి. చీమలు పట్టినా కూడా పారిపోతాయి.
