- Home
- International
- USA Iran: ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన.. మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి
USA Iran: ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన.. మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి
USA Iran: అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన
ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు మరింత విస్తరించాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కీలక సైనిక మౌలిక వసతులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఈ క్లిష్ట పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుని దేశానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని, అవసరమైతే దీర్ఘకాల పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి కేంద్రంగా ముదురుతున్న పోరు
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగిస్తోందని ఆరోపిస్తూ అమెరికా సైన్యం ఇరాన్ తీరప్రాంతాల్లోని డ్రోన్ కేంద్రాలు, క్షిపణి నిల్వలు, నిఘా వ్యవస్థలు, నౌకాదళానికి చెందిన కీలక స్థావరాలపై వరుస దాడులు నిర్వహిస్తోంది. అదే సమయంలో హర్మూజ్ సమీపంలో ఓ చమురు ట్యాంకర్పై దాడి జరిగినట్లు యూకేకు చెందిన సముద్ర భద్రతా సంస్థ ధ్రువీకరించింది. నౌకలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది.
గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. కువైట్లోని అరిఫ్జాన్ సైనిక స్థావరంపై ప్రయోగించిన క్షిపణులు హెచ్ఐఎమ్ఏఆర్ఎస్ (HIMARS) రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. అలాగే పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, డ్రోన్ హ్యాంగర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం "ఆపరేషన్ లైట్నింగ్" పేరుతో డ్రోన్లు, క్షిపణుల ద్వారా ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొంది. అయితే తమ వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా క్షిపణులను అడ్డుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
'ఆపరేషన్ నాసర్-2'తో మరో దాడి.. ఇరాన్ కీలక ప్రకటనలు
"ఆపరేషన్ నాసర్-2" పేరుతో మరో దాడి చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. జార్డన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసి అక్కడి మిస్సైల్ కంట్రోల్ రాడార్ వ్యవస్థలను, షెల్టర్లో ఉన్న ఎఫ్-15 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అలాగే రుక్బాన్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ కాంపౌండ్పై కూడా దాడులు జరిగాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇక బహ్రెయిన్లో ఉన్న అమెరికా ఐటీ సంస్థ అమెజాన్కు చెందిన డేటా సెంటర్ను క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ అంశంపై అమెజాన్ లేదా బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ వెలువడలేదు.
అమెరికా బలగాలు గల్ఫ్ ప్రాంతాన్ని వీడాల్సిందే
ఇటీవల జరిగిన దాడుల్లో రెండు వారాల వ్యవధిలో సుమారు 100 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా సైనిక బలగాలు పూర్తిగా గల్ఫ్ ప్రాంతాన్ని వీడే వరకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా తన సైనిక చర్యలను కొనసాగిస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరు దేశాలు సైనిక చర్యలను ఆపే సంకేతాలు కనిపించకపోవడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

