- Home
- Telangana
- Ration Card: సమయం లేదు మిత్రమా.. ఇలా చేయకపోతే రేషన్ కార్డు రద్దడం ఖాయం, ఇంకో 10 రోజులే
Ration Card: సమయం లేదు మిత్రమా.. ఇలా చేయకపోతే రేషన్ కార్డు రద్దడం ఖాయం, ఇంకో 10 రోజులే
Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా జూలై 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే ప్రభుత్వ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

ప్రతి కుటుంబ సభ్యుడికి e-KYC తప్పనిసరి
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా తమ వివరాలను ధృవీకరించుకోవాలి. కుటుంబంలో ఒకరు మాత్రమే e-KYC చేయించుకుంటే సరిపోదు. ప్రతి సభ్యుడు ఆధార్ ఆధారిత వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సరిగ్గా ఉండేలా ఈ ధృవీకరణ చేపడుతున్నారు.
ఎక్కడ చేయించాలి.. ఎలాంటి పత్రాలు తీసుకెళ్లాలి?
e-KYC కోసం సమీపంలోని రేషన్ దుకాణం లేదా మీసేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. రేషన్ కార్డుతో పాటు అందులో నమోదైన ప్రతి సభ్యుడి అసలు ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధృవీకరణ పూర్తయిన వెంటనే e-KYC ప్రక్రియ ముగుస్తుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ఎవరు డబ్బులు అడిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది.
e-KYC ఎందుకు చేస్తున్న ప్రభుత్వం?
అర్హులైన కుటుంబాలకే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చూడటం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. అలాగే నకిలీ రేషన్ కార్డులు, వినియోగంలో లేని కార్డులను గుర్తించడం, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన లబ్ధిదారుల వివరాలను నవీకరించడం కూడా ఇందులో భాగమే. దీంతో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
త్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలో కొత్త తరహా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యూఆర్ కోడ్తో కూడిన కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన వెంటనే పంపిణీ తేదీని ప్రకటించనున్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పరిమాణంలో రూపొందించిన ఈ కార్డుపై లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఫొటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటివరకు పొందిన రేషన్ సరుకుల వివరాలు కూడా కనిపిస్తాయి. టి-రేషన్ యాప్ ద్వారా కూడా ఈ కార్డును లింక్ చేసుకుని సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్డుల తయారీకి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్.. గడువు దాటక ముందే పూర్తి చేయండి
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైతే రేషన్ దుకాణాల పని వేళలను కూడా పొడిగించాలని అధికారులకు సూచించారు. కాబట్టి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు జూలై 31లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.

