సలహాలు వద్దు... కుదిరితే సహాయం చెయ్యి.. ఈ పక్షి కథ మీ ఆలోచననే మార్చేస్తుంది..!
Motivational Story: ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా... సలహాలు ఇవ్వడానికి అందరూ వచ్చేస్తూ ఉంటారు. సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ, పనికి రాని సలహా కంటే.. కుదిరితే సహాయం చేయాలి అని ఈ పక్షి కథ చెబుతోంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం...

తల్లి పక్షి ఆవేదన..
ఓ రోజు ఓ తల్లి పక్షి.. సముద్రంలో నీటిని తన నోటితో తీసి బయట పారబోస్తూ ఉంటుంది. అది చూసిన మరో పక్షి.. వచ్చి తల్లి పక్షి చేస్తున్న పని చూసి నవ్వుతుంది. ‘ ఏం చేస్తున్నావ్ నువ్వు?’ అని అడుగుతుంది. దానికి ఆ తల్లి పక్షి.. ‘ నా బిడ్డలు ఈ సముద్రంలో పడిపోయాయి. సముద్రంలో నీటిని తీసేసి.. నా బిడ్డలను బయటకు తీసుకుంటున్నాను’ అని చెబుతుంది. ఆ మాటకు మరో పక్షి నవ్వి.. ‘సముద్రంలో నీటిని నువ్వు ఎంత కాలం తీస్తే.. నీ బిడ్డలు నీకు దొరుకుతారు..? ’ దీని వల్ల ఉపయోగం లేదు అని చెబుతుంది. దానికి ఆ తల్లి పక్షి.. ‘ కుదిరితే సహాయం చెయ్యి.. నీ సలహాలు నాకు వద్దు’ అని చెబుతుంది. దీంతో.. ఆ పక్షి.. కూడా తల్లి పక్షికి సహాయం చేయడం మొదలుపెడుతుంది.
ఒక్కటైన పక్షులు..
ఈ రెండు పక్షులు చేస్తున్న పనిని మరి కొన్ని పక్షులు చూశాయి. వచ్చి.. మొదటి పక్షి అడిగినట్లుగానే ఏం జరిగింది అని అడిగాయి. అందుకు.. తల్లి పక్షి చెప్పిన సమాధానం విని.. అవి కూడా తలా ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టాయి. కానీ.. తల్లి పక్షి వారి సలహాలు వినలేదు. ‘ కుదిరితే సహాయం చేయండి..’ అని మాత్రమే అడిగింది. దీంతో.. ఆ పక్షులు కూడా సహాయం చేయడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ అక్కడికి చేరి.. తమ వంతు ప్రయత్నంగా... సముద్రంలో నీటిని తోడటం మొదలుపెట్టాయి.
పక్షులకు తోడుగా గరుడ పక్షి..
ఈ పక్షులు పడుతున్న ఆవేదన మొత్తం దేవతా పక్షి గరుడకు తెలుస్తుంది. దీంతో... ఆ గరుడ పక్షి కూడా.. సహాయం చేయడానికి వస్తూ ఉంటుంది. అది చూసిన శ్రీ మహా విష్ణు.. గురుడను ఆపుతాడు. విషయం ఏంటి అని అడుగుతాడు. ‘ నేను కూడా వెళ్లి ఆ పక్షులకు సహాయం చేయాలి.. తల్లి పక్షికి.. పిల్ల పక్షులను చేర్చాలి’ అని చెబుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు.. నేను కూడా నీతో వస్తాను.. అని ఆ పక్షకుల దగ్గరకు వెళతారు. అక్కడకు వెళ్లి.. విష్ణుమూర్తి.. సముద్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ‘ మర్యాదగా.. ఆ పిల్ల పక్షులను తల్లి పక్షికి ఇచ్చేయమని.. లేకపోతే.. సముద్రంలో చుక్క నీరు కూడా లేకుండా చేస్తాను’ అని అంటారు. ఆ మాటలకు భయపడిపోయిన సముద్రుడు..తాను మింగేసిన పక్షి పిల్లలను బయటకు తీసి.. తల్లి పక్షికి అందిస్తాడు. దీంతో.. ఆ తల్లి పక్షి.. సంతోషంగా తన బిడ్డలను చేరుకుంటుంది.
సలహాలు వద్దు.. కుదిరితే సహాయం చెయ్యి..
ఆ పక్షులన్నీ.. తమ వల్ల ఏం అవుతుందిలే అనుకోకుండా.. సహాయం చేయడానికి ముందుకు రావడం వల్లే.. చివరకు ఆ సమస్య దైవం దాకా చేరి.. ఆ తల్లి పక్షికి న్యాయం జరిగింది. ఇదే కథ మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా.. నోటికి వచ్చిన సలహాలు చెప్పడం కాదు.. వీలైతే సహాయం చేయడం నేర్చుకోవాలి. ఆ సహాయం వారిని కష్టం నుంచి బయట పడేసే అవకాశం ఉంటుంది. మనం చేసే చిన్న సహాయం.. వారికి ఎంతో పెద్ద కష్టాన్ని తీర్చవచ్చు. అందుకే.. వీలైతే సలహాలు ఇవ్వడం కాదు.. సహాయమే చేద్దాం..
