- Home
- Sports
- Cricket
- Asia Cup 2026: హాంగ్కాంగ్ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్కు దూసుకెళ్లిన భారత్
Asia Cup 2026: హాంగ్కాంగ్ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్కు దూసుకెళ్లిన భారత్
Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ 137 రన్స్ తేడాతో హాంగ్కాంగ్పై ఘనవిజయం సాధించింది. స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ తో విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఆసియా కప్ 2026: సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు రచ్చ లేపింది. గ్రూప్ Aలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో హాంగ్కాంగ్ను భారత్ 137 రన్స్ భారీ తేడాతో ఓడించింది. ఈ భారీ విజయంతో టీమిండియా గ్రాండ్గా ఆసియా కప్ సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓపెనర్ స్మృతి మంధాన తుపాను సెంచరీతో విరుచుకుపడటంతో భారత్ ఈ విజయాన్ని సాధించింది.
స్మృతి మంధాన సెంచరీ ధమాకా
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. స్మృతి మంధాన 64 బంతుల్లోనే 124 రన్స్ చేసి మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మంధానకు తోడుగా షెఫాలీ వర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 రన్స్ చేసింది. వీరిద్దరూ తొలి వికెట్కు 74 రన్స్ జోడించారు.
ఆ తర్వాత పవర్ప్లే ముగిశాక మంధాన మరింత అటాకింగ్ గేర్ మార్చింది. ప్రతికా రావల్ 10 రన్స్, రిచా ఘోష్ 11 రన్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 10 రన్స్ చేశారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 రన్స్ కొట్టింది. హాంగ్కాంగ్ బౌలర్లలో మెరీనా లాంప్లో 2 వికెట్లు తీయగా, రుచిత వెంకటేష్, జాయ్లీన్ కౌర్ చెరో వికెట్ పడగొట్టారు.
56 రన్లకే హాంగ్కాంగ్ ఆలౌట్
194 రన్ల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హాంగ్కాంగ్ జట్టు భారత బౌలర్ల దాటికి అస్సలు తట్టుకోలేకపోయింది. 16.2 ఓవర్లలోనే కేవలం 56 రన్స్ చేసి ఆలౌట్ అయింది. భారత ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ మొదటి ఓవర్ను మెయిడెన్గా వేసి ఒత్తిడి పెంచింది. రెండో ఓవర్లోనే నందిని శర్మ మారిగా హిల్ (0)ని అవుట్ చేసింది. హాంగ్కాంగ్ పవర్ప్లేలో వికెట్ నష్టానికి 16 రన్స్ మాత్రమే చేయగలిగింది. యాస్మిన్ దస్వానీని (11) దీప్తి శర్మ అవుట్ చేయగా, టీమ్లో అత్యధిక రన్స్ చేసిన నటాషా మైల్స్ (15)ను ప్రేమా రావల్ అవుట్ చేసింది.
దీప్తి శర్మ 3 వికెట్ల మ్యాజిక్
ఆ తర్వాత హాంగ్కాంగ్ వికెట్ల పతనం మరింత వేగంగా సాగింది. ప్రేమా రావల్ 12వ ఓవర్లో హాంగ్కాంగ్ కెప్టెన్ క్యారీ చాన్ను అవుట్ చేసింది. నందిని శర్మ తన రెండో వికెట్గా మరియమ్ బీబీ (7)ని పంపగా, శ్రీ చరణి 15వ ఓవర్లో మెరీనా లాంప్లో (14)ను అవుట్ చేసింది. 16వ ఓవర్లో దీప్తి శర్మ అద్భుతం చేసింది. ఒకే ఓవర్లో జాయ్లీన్ కౌర్, ఇక్రా సహర్, మేయ్ వై సివులను అవుట్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. చివరి వికెట్ను శ్రీ చరణి తీయడంతో హాంగ్కాంగ్ ఇన్నింగ్స్ 56 రన్ల వద్ద ముగిసింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా శ్రీ చరణి, ప్రేమా రావల్, నందిని శర్మ చెరో 2 వికెట్లు సాధించారు.
మిథాలీ రాజ్ను దాటేసిన మంధాన వరల్డ్ రికార్డ్
ఈ మ్యాచ్లో 124 రన్స్ చేసిన స్మృతి మంధాన ఒక అరుదైన హిస్టారికల్ రికార్డ్ను తన పేరిట లిఖించుకుంది. మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక రన్స్ చేసిన భారత ప్లేయర్గా నిలిచింది. భారత్ దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ (10,868 రన్స్) రికార్డును మంధాన (10,880 రన్స్) దాటేసింది. ప్రస్తుతం ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక రన్స్ చేసిన టాప్-5 ప్లేయర్లలో స్మృతి మంధాన మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మిథాలీ రాజ్, సూజీ బేట్స్ (10,740), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273), స్టెఫానీ టేలర్ (10,007) ఉన్నారు.

