Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asian Games 2026: జపాన్లో సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరిగే ఆసియా గేమ్స్ 2026 కోసం భారత పురుషుల క్రికెట్ జట్టును పంపేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ ను పక్కన పెట్టి వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, లక్ష్మణ్ కోచింగ్.. ఆసియా గేమ్స్లో భారత్ వేట మొదలు
ఆసియా గేమ్స్ 2026 టోర్నీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. జపాన్లోని ఐచి-నాగోయాలో జరిగే ఈ ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెప్టెంబర్ 28 నుంచి బరిలోకి దిగుతోంది. అయితే ఈ మెగా టోర్నీకి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వ్యవహరించడం లేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసియా గేమ్స్లో పురుషుల టీమ్కు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
వెస్టిండీస్ సిరీస్తో షెడ్యూల్ క్లాష్
ఆసియా గేమ్స్కు గౌతమ్ గంభీర్ వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ షెడ్యూల్ క్లాష్ కావడమే. భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 3న ముగుస్తుంది. గంభీర్ నేతృత్వంలోని రెగ్యులర్ సపోర్ట్ స్టాఫ్ మొత్తం విండీస్ హోమ్ సిరీస్తో బిజీగా ఉంటారు. అందుకే ఆసియా గేమ్స్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ను ప్రత్యేకంగా కోచ్గా పంపుతున్నారు.
లక్ష్మణ్ సపోర్ట్ స్టాఫ్ వీరే
ఆసియా గేమ్స్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ కాంబినేషన్లో బలమైన కోచింగ్ స్టాఫ్ను బీసీసీఐ రెడీ చేసింది. లక్ష్మణ్కు అసిస్టెంట్ కోచ్లుగా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి, హృషీకేష్ కనిట్కర్, సుభదీప్ ఘోష్ వ్యవహరిస్తారు. రీసెంట్గా ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన సుభదీప్ ఘోష్, వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు అందుబాటులో ఉండరు. ఇక 2023లో హాంగ్జౌ లో జరిగిన ఆసియా గేమ్స్లో కూడా లక్ష్మణ్ కోచ్గానే వ్యవహరించి భారత్కు గోల్డ్ మెడల్ అందించారు.
గోల్డ్ మెడలే టార్గెట్.. టీమిండియా ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్
గత ఆసియా గేమ్స్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపిన బీసీసీఐ.. ఈసారి మాత్రం ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ను రంగంలోకి దించుతోంది. శ్రేయస్ ఐయర్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు టి20 వరల్డ్ కప్ నెగ్గిన స్టార్ ప్లేయర్లు ఉన్నారు. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే భారత్, తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 28న ఉదయం 10:30 గంటలకు ఆడనుంది.
మహిళల జట్టుకు అమూల్ ముజుందార్ సపోర్ట్
పురుషుల జట్టు పరిస్థితి ఇలా ఉంటే, మహిళల జట్టుకు మాత్రం రెగ్యులర్ సపోర్ట్ స్టాఫే కొనసాగుతారు. యూఏఈలో ఆసియా కప్ ముగిసిన వెంటనే హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు జపాన్ బయలుదేరుతుంది. హెడ్ కోచ్ అమూల్ ముజుందార్, బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వి, ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలి మహిళల జట్టుతోనే ఉంటారు. పురుషులు, మహిళల విభాగాల్లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న భారత్ ఈసారి కూడా రెండు గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఆసియా గేమ్స్ 2026 : భారత క్రికెట్ టీమ్స్ ఇవే
భారత పురుషుల జట్టు: శ్రేయస్ ఐయర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రిచా ఘోష్, గుణాలన్ కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందని శర్మ.

