- Home
- Andhra Pradesh
- రూ. 15వేల కోట్ల పెట్టుబడి, 45 వేలకిపై ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్లో మరో దిగ్గజ సంస్థ
రూ. 15వేల కోట్ల పెట్టుబడి, 45 వేలకిపై ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్లో మరో దిగ్గజ సంస్థ
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో సముద్ర ఆధారిత పరిశ్రమలకు మరింత ఊతం లభించనుంది. దుగరాజపట్నంలో భారీ షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇన్ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది.

రూ.15 వేల కోట్ల పెట్టుబడి
దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్బిల్డింగ్తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వస్తాయి.
ఏడాదికి 12 లక్షల టన్నుల సామర్థ్యం
ప్రతిపాదిత షిప్యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ GT) నౌకల నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా వీలుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్యార్డ్ను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా నౌకలను నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది.
దుగరాజపట్నంలో సమగ్ర షిప్బిల్డింగ్ క్లస్టర్
దుగరాజపట్నంలో షిప్బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) ప్రకారం షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుండగా, షిప్బిల్డింగ్ క్లస్టర్ను కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం (SbDS) కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ క్లస్టర్కు ఎండీఎల్ను యాంకర్ షిప్యార్డ్గా ఎంపిక చేశారు.
దేశ షిప్బిల్డింగ్ లక్ష్యాలకు అనుగుణంగా..
భారత్ను 2047 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి షిప్బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యానికి దుగరాజపట్నం ప్రాజెక్టు దోహదపడనుంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎండీఎల్ సీఎండీ జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

