బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కొంటున్న ఫార్ములా ఈ కేసు విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు అక్టోబర్ 30, 2026కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కంపెనీల ప్రతినిధులు రాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
నాంపల్లిలోని స్పెషల్ ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) కోర్టు శుక్రవారం ఫార్ములా ఈ రేసు కేసు విచారణను అక్టోబర్ 30, 2026కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధాలున్న కొన్ని కంపెనీల ప్రతినిధులు కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణను వాయిదా వేశారు.
అక్టోబర్ 30కి విచారణ వాయిదా
కోర్టులో ఏం జరిగిందనే దానిపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితా రెడ్డి వివరాలు వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్, ఇతర అధికారులతో కలిసి కోర్టుకు స్వయంగా హాజరయ్యారని ఆమె చెప్పారు. "ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేటీఆర్, ఇతర అధికారులు కోర్టుకు వచ్చారు. కానీ కొన్ని కంపెనీల ప్రతినిధులు రాలేదు. అందుకే తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేశారు" అని లలితా రెడ్డి వివరించారు.
ఇది రాజకీయ కక్ష సాధింపే : బీఆర్ఎస్
కోర్టు విచారణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. దర్యాప్తు సంస్థలను వాడుకుని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్నారు. "రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పని లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతాం. తెలంగాణ ప్రజల పక్షాన ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం" అని సంజయ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. "సెక్షన్ 22ఏ భూముల సమస్యలు, ఉద్యోగాల కల్పన, రైతుబంధు, రుణమాఫీ లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం" అని సంజయ్ అన్నారు.
అసలు ఆరోపణలు ఏంటి?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. దీనికోసం ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేశారనే ఆరోపణలపై 2024లో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. 2023లో జరిగిన ఈ రేసు నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిబంధనలకు విరుద్ధంగా లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO)కు నిధులు బదిలీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 44 నుంచి 55 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నిధుల బదిలీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. రెండోసారి రేసు నిర్వహణ ఖర్చులను కూడా హెచ్ఎండీఏ భరించేలా అధికారులను ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ రేసు జరగలేదు. ఈ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేటీఆర్, ఇతరులపై ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.


