డిల్లీలో కాంగ్రెస్ ఎంపీల అరెస్టుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్… దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడానికి నిరసనగా తెలంగాణ బిజెపి హైదరాబాద్ లో ఆందోళనలు చేపట్టాయి. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Hyderabad : దేశ రాజధాని డిల్లీలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన 'ఛల్లో పార్లమెంట్', ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీల ప్రధాని నివాసం ముట్టడి ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమయ్యింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కీలక కాంగ్రెస్ నాయకులను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నేడు (జూలై 22న) తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇదే సమయంలొ దేశ ప్రధాని ఇంటి ముట్టడిని ఖండిస్తూ తెలంగాణ బిజెపి కూడా నిరసన చేపట్టింది. ఇరుపార్టీల ఆందోళనలతో హైదరాబాద్ కూడా ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ మంత్రుల అరెస్ట్...
డిల్లీలో కాంగ్రెస్ నాయకుల అరెస్టుల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు 'ఛలో లోక్ భవన్' కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు గవర్నర్ నివాసానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే నెక్లెస్ రోడ్డు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు... దీంతో తోపులాట చోటుచేసుకుంది.
అయితే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దిన్, దామోదర రాజనర్సింహ తదితరులు లోక్ భవన్ వద్దకు చేరుకున్నారు. చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే టిపిసిసి చీఫ్, మంత్రులు, కీలక నాయకులను అరెస్ట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ధర్నా
ప్రధాని మోదీ ఇంటి ముట్టడి నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనలో ఉన్న ఆయన స్థానిక నాయకులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలి నిర్వహించారు... అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ హన్మకొండలొ నిరసన చేపట్టారు.
తెలంగాణ బిజెపి చీఫ్ అరెస్ట్..
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పోటీగా బిజెపి నాయకులు కూడా నిరసన చేపట్టారు... ఏకంగా కాంగ్రెస్ కార్యాలయం 'గాంధీ భవన్' ముట్టడికి ప్రయత్నించారు. భారీగా బిజెపి నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బిజెపి శ్రేణులు పరస్పర దాడులకు సిద్దం కావడంతో పరిస్థితి చేయిదాటేలా ఉందని గ్రహించిన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు.
రామచంద్రరావు అరెస్ట్ పై కేంద్ర మంత్రి సీరియస్..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఈ అరెస్టును ఖండించిన కేంద్ర మంత్రి తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పాలకపక్షం దారుణంగా వ్యవహరిస్తోందని... అధికారంలో ఉంటూ ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.


