Baby Food: 6 నెలల నుంచి ఏడాది పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి? ఏవి పెట్టకూడుదు
Baby Food: ఆరు నెలల తర్వాత పిల్లలకు తల్లిపాలతో పాటు సాలిడ్ ఆహారం మొదలుపెడతారు. అయితే చాలా మంది తల్లులకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఏవి పెట్టకూడదు? అనే విషయాలపై అవగాహన ఉండదు.

ఆరు నెలల వయసు దాటాక ఫుడ్స్
చంటి పిల్లలకు ఆరు నెలలు వచ్చాక తల్లిపాలు లేదా ఫార్ములా పాలు ఒక్కటే సరిపోటు. వాటితో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. వారి ఎదుగుదలకు మరిన్ని పోషకాలు అవసరం పడతాయి. ఈ వయసులో వాళ్ల పోషకావసరాలు బయటి ఆహారం మొదలుపెట్టమని చెబుతారు వైద్యులు.
తల్లిపాలు లేదా ఫార్ములా పాలను వెంటనే ఆపేసి, వేరే ఆహారానికి పిల్లల్ని మార్చకూడదు. మొదట్లో కొద్దికొద్దిగా పెడుతూ, కొత్త రుచులకు, పదార్థాలకు అలవాటు పడేలా పిల్లలకు సమయం ఇవ్వాలి. ముఖ్యంగా, పెద్దలు తినే ఆహారాన్ని నేరుగా పిల్లలకు పెట్టకూడదు. ఆహారం మెత్తగా, వాళ్లకు తగినట్టుగా వండాలి.
పిల్లలకు ఏమేం ఆహారం పెట్టొచ్చు?
ఆరు నెలల నిండిన బిడ్డకు తినే సామర్థ్యాన్ని బట్టి రకరకాల ఆహారాలను నెమ్మదిగా పరిచయం చేయొచ్చు.అన్నం వండిన గంజి, బాగా ఉడికించిన పప్పులు, బాగా ఉడికించిన కూరగాయలు, మెత్తటి పండ్లు, గుడ్లు, బాగా ఉడికించిన మాంసం లేదా చేపలు, చక్కెర లేని పెరుగు వంటివి సరైన రూపంలో ఇవ్వొచ్చు.
'ఏం పెడుతున్నాం?' అనే దానితో పాటు 'ఎలా పెడుతున్నాం?' అన్నది కూడా ముఖ్యం. మొదట్లో మెత్తగా గుజ్జులా చేసి, తర్వాత వాళ్ల వయసును బట్టి కొంచెం గట్టి పదార్థాలకు మార్చాలి. ఉదాహరణకు, గట్టిగా ఉండే యాపిల్ ముక్కను నేరుగా ఇవ్వకుండా, దాన్ని మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి ఇవ్వాలి. పిల్లలు తినేటప్పుడు కూర్చోబెట్టాలి. పెద్దవాళ్లు పక్కనే ఉండి గమనిస్తూ ఉండాలి. వాళ్ల నోట్లో ఆహారాన్ని కుక్కకూడదు.
తేనె, ఉప్పు, చక్కెర... వద్దు
ఏడాది నిండేవరకు పిల్లలకు తేనె పెట్టకూడదు. తేనెలో ఉండే 'క్లోస్ట్రిడియం బోటులినమ్' (Clostridium botulinum) అనే బ్యాక్టీరియా వల్ల 'ఇన్ఫాంట్ బోటులిజం' అనే తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, పిల్లల ఆహారంలో అనవసరంగా ఉప్పు, చక్కెర కలపొద్దు. పెద్దలకు అవసరమైనంత ఉప్పు, తీపి పిల్లలకు అవసరం లేదు.
పండ్లలో ఉండే సహజమైన చక్కెర వేరు, మనం అదనంగా కలిపే చక్కెర వేరు. కాబట్టి పండ్లు మానక్కర్లేదు, కానీ అదనపు చక్కెర కలపడం మానాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎక్కువ ఉప్పు, చక్కెర లేకుండా చూసుకోవాలి.
గుడ్లు, పల్లీలు, పాల ఉత్పత్తులు, చేపలు వంటివి అలర్జీ కలిగిస్తాయనే భయంతో పెట్టరు. గుడ్డును బాగా ఉడికించి లోపలి పచ్చసొనను తినిపించాలి. పచ్చసొనలో కొంచెం పాలు కలిపితే అది పలుచగా అవుతుంది. సులువుగా గొంతుదిగుతుంది. ఎగ్ వైట్ మాత్రం ఏడాది నిండే వరకు పెట్టకూడదు. ఇక చేపలను ఉడికించి, ముళ్లు తీసేయాలి. పల్లీలను పీనట్ బటర్ రూపంలో ఇవ్వచ్చు.

