Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?
Samosa: సమోసా మనదేశంలోని ప్రతి వీధిలో అమ్ముతూనే ఉంటారు. అసలు ఇది మనదేశపు వంటకమే కాదు.. కానీ ఇప్పుడు మనదేశంలో సమోసానే ఎక్కువగా అమ్ముడుపోతోంది. అసలు సమోసా ఎక్కడ పుట్టింది? మన దేశానికి ఎలా వచ్చింది? ఈ వివరాలు తెలుసుకోండి.

సమోసా ఎక్కడ పుట్టింది?
భారతీయులకు సాయంత్రం సమయంలో సమోసా ప్రతిరోజూ తినేవారు ఎంతో మంది. గల్లీలోని చిన్న బండి మొదలుకొని పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల దాకా ఎక్కడ చూసినా కనిపించే రుచికరమైన స్నాక్ ఇది. నిజానికి సమోసా మనదేశానికి చెందినది కాదు. సమోసా మూలాలు 10వ శతాబ్దానికి చెందిన మధ్యప్రాచ్యం , మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రాచీన పర్షియాలో దీనిని 'సంబోసగ్' (Sanbosag) లేదా 'సంబుసక్' (Sambusak) అని పిలిచేవారు. ఆ కాలంలో చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించే వర్తకులు, యాత్రికులు మార్గమధ్యంలో ఆహారంగా తీసుకువెళ్లడానికి మైదా పిండి పొరల్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, నట్స్ నింపి నిప్పులపై లేదా నూనెలో వేయించి సమోసాలను తయారుచేసేవారు.
మనదేశానికి సమోసా ప్రయాణం
ఈ విదేశీ వంటకం 13వ, 14వ శతాబ్దాల కాలంలో సిల్క్ రోడ్ వర్తకులు, మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు, వంటవాళ్ల ద్వారా భారత్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ సుల్తానుల పాలనలో రాజభవనాల్లో జరిగే విందులలో సమోసాను ఎంతో ప్రత్యేకమైన వంటకంగా వడ్డించేవారని ప్రసిద్ధ రచయిత అమీర్ ఖుస్రో, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా తమ రచనల్లో చెప్పారు. అప్పట్లో ఇది మాంసంతో కూడిన రాజభోజనంగా మాత్రమే ఉండేది. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి బంగాళాదుంపలను (ఆలూ) పరిచయం చేయడంతో సమోసా రుచి మారింది. భారతీయ వంటగాళ్లు మాంసానికి బదులుగా ఉడకబెట్టిన ఆలూ, పచ్చి బఠానీలు, అల్లం, ధనియాలు, గరం మసాలాలను స్టఫింగ్గా ఉపయోగించడం ప్రారంభించారు.
పేదవారి స్నాక్
మాంసం బదులు బంగాళాదుంపలు చేరడంతో సమోసా సామాన్య ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. తక్కువ ధర, తింటే పొట్ట నిండే గుణం, అద్భుతమైన మసాలా రుచి వల్ల ఇది దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రాంతాన్ని బట్టి ఉత్తరాదిలో ఆలూ-సమోసా, హైదరాబాద్లో కీమా సమోసా, గుజరాత్లో వెజ్-పన్నీర్ సమోసాలుగా వివిధ రూపాల్లో తయారుచేస్తున్నారు. పుదీనా చట్నీ, తీపి చింతపండు చట్నీలతో వేడివేడిగా వడ్డించే సమోసా.. దేశ సరిహద్దులు దాటి వచ్చి నేడు భారతీయ ఆహార సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచింది. వర్షం పడుతున్నా, అతిథులు వచ్చినా అందరి మొదటి ఎంపికగా నిలుస్తూ భారతీయుల ఆల్టైమ్ ఫేవరెట్ స్నాక్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

