- Home
- Sports
- Cricket
- Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Shafali Verma: జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ సెమీఫైనల్లో భారత యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన బ్యాట్ పవర్ చూపించింది. బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 రన్స్ తో ప్రపంచ రికార్డుల మోత మోగించింది.

49 బాల్స్లో సెంచరీ బాదేసింది.. జపాన్లో హర్యానా పాప రికార్డుల రచ్చ
ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. జపాన్లోని నిషిన్, నాగోయాలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత ఓపెనర్ షెఫాలీ వర్మ తుపాను సెంచరీతో విరుచుకుపడింది. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
49 బంతుల్లో విధ్వంసం.. ఆసియా గేమ్స్లో తొలి సెంచరీ
భారత తుఫాన్ ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి రికార్డుల మోత మోగించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సింగిల్ తీసి తన మొదటి టీ20 అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకుంది. ఉమెన్స్ ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన మొదటి మహిళా క్రికెటర్గా షెఫాలీ వర్మ నిలిచింది. ఓవరాల్గా ఆసియా గేమ్స్లో సెంచరీ సాధించిన రెండో భారత ప్లేయర్ గా (యశస్వి జైస్వాల్ తర్వాత) ఘనత సాధించింది. తన ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాది 204.08 స్ట్రైక్ రేట్తో బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంది.
ఒకే ఏడాదిలో 35 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్
ఈ మ్యాచ్లో 9 సిక్సర్లు బాదడం ద్వారా షెఫాలీ వర్మ ఒకే క్యాలెండర్ ఇయర్లో ఉమెన్స్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. 2026 క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు షెఫాలీ 35 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపత్తు పేరు మీద ఉన్న 32 సిక్సర్ల (2024) రికార్డును ఆమె అధిగమించింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 104 సిక్సర్లు పూర్తి చేసుకుని, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధానను దాటేసింది.
వరల్డ్ నంబర్ 1 గా స్మృతి మంధాన కొత్త రికార్డు
మరోవైపు ఓపెనర్ స్మృతి మంధాన 19 బంతుల్లో 37 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్లో (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక పరుగులు చేసిన రికార్డు సాధించింది. న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ను దాటి 171 ఇన్నింగ్స్ల్లో 4,788 పరుగులతో అగ్రస్థానానికి చేరింది. పురుషుల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బాబర్ అజామ్ (4,596) కంటే కూడా స్మృతి, సూజీ బేట్స్ ముందుండటం విశేషం.
ఫైనల్ వైపు భారత్ అడుగులు.. గోల్డ్ మెడల్ ఖాయమేనా?
ఓపెనర్లు తొలి వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. అనంతరం జి. కమలిని (3) త్వరగానే అవుట్ అయినా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి షెఫాలీకి చక్కటి సహకారం అందించింది. దీంతో భారత్ 195/4 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మంగళవారం జరిగే గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడుతుంది. పసిడి పతకమే లక్ష్యంగా విమెన్ ఇన్ బ్లూ దూసుకెళ్తోంది.

