Gold Price Crash: అమెరికా-ఇరాన్ మధ్య ట్యాంకర్ వార్....కుప్పకూలిన పసిడి, వెండి..ఎంతంటే?
Gold Price Crash: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఈరోజు మరోసారి బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ రేట్లు ఇలా తగ్గడం కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చే వార్త. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు.. బుధవారం మరోసారి భారీగా క్షీణించాయి. గంటల వ్యవధిలోనే ధరలు గణనీయంగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ రేట్లు ఇలా తగ్గడం శుభవార్తగా మారింది. వెండి ధర కూడా కాస్త దిగొచ్చింది.
24 గ్రాముల బంగారం ధర - రూ.1,54,310
సెప్టెంబర్ 9న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,310గా ఉంది. బుధవారం ఒక్కరోజే రూ.1,040 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,41,450 పలుకుతోంది. ఇది గత ధరతో పోలిస్తే రూ.950 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,150 వద్ద ఉంది. ఇక్కడ కూడా ధరలు దాదాపు రూ.1,000 మేర తగ్గాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,680, 22 క్యారెట్ల బంగారం రూ.1,42,710 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
దేశీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలోని ఐదు చమురు ట్యాంకర్లను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. గత రెండు రోజులుగా తమ యుద్ధనౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది.
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. జోర్డాన్లోని అల్ అజ్రఖ్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకున్నామని, అక్కడ అమెరికా యుద్ధ విమానాలకు సంబంధించిన హ్యాంగర్లు ధ్వంసమయ్యాయని ఐఆర్జీసీ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో రెండు అమెరికా నౌకలు, ఎనిమిది చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు కూడా తెలిపింది. అయితే అమెరికా ఈ వాదనలను పూర్తిగా ధ్రువీకరించలేదు.
ట్యాంకర్ వార్
ఈ పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరల్లో మళ్లీ కదలిక మొదలైంది. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో గోల్డ్కు డిమాండ్ పెరుగుతుందని భావించినా.. ప్రస్తుతం ఇతర అంతర్జాతీయ ఆర్థిక అంశాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక 1980-88 ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో జరిగిన ‘ట్యాంకర్ వార్’ మరోసారి చర్చకు వస్తోంది. అప్పట్లో పర్షియన్ గల్ఫ్లో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై దాడులు జరగగా.. 400కు పైగా నౌకలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది.
ఇప్పుడు మరోసారి హర్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గుతాయా? లేక అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా మళ్లీ పెరుగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

