Asianet News TeluguAsianet News Telugu

justice for Disha: ఆర్టీసీ సేవలపై కేసీఆర్ నిర్ణయం తప్పేనా..?

ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు 24 గంటలోపే నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్నామని చెబుతున్నారే తప్ప, ఈ సంఘటనపై తగిన సమయంలో తగిన రీతిలో పోలీసులు స్పందించి ఉంటే, ఈ దారుణమైన ఘటన జరిగేదే కాదు. 

Justice for Disha: has kcr committed a mistake by altering the public transport timings in hyderabad?
Author
Hyderabad, First Published Dec 4, 2019, 1:51 PM IST

హైదరాబాద్: తెలంగాణాలో అత్యంత పాశవికంగా, కిరాతకంగా నన్ను వదిలేయండి అని వేడుకుంటున్నా, జాలి, దయ, కనికరం లేకుండా మదమెక్కి ఒక అభాగ్యురాలి ప్రాణం తీసిన సంఘటన ఎంత మరిచిపోదామన్నా, మరిచిపోవడం కష్టంగా ఉంది. 

ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు 24 గంటలోపే నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్నామని చెబుతున్నారే తప్ప, ఈ సంఘటనపై తగిన సమయంలో తగిన రీతిలో పోలీసులు స్పందించి ఉంటే, ఈ దారుణమైన ఘటన జరిగేదే కాదు. 

ఉద్భవించాల్సిన ప్రశ్నలు...

ఇక్కడ ఉద్భవించాల్సిన ప్రశ్న పోలీసు వ్యవస్థ  పనితీరు సక్రమంగా ఉంటె ఈ దుర్ఘటన జరిగేదా? ఇప్పుడేదో సోషల్ మీడియాలో హాక్ ఐ యాప్ అని, హైదరాబాద్ పోలీసుల వినూత్న రక్షణ చర్య అని చెబుతున్నారు బాగానే ఉంది. ఇలాంటివి చాలా అవసరం కూడా. 

కానీ సాంకేతికతే అంతా చూసుకుంటుందనే భావన కాబోలు ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద గస్తీ తిరగాల్సిన పెట్రోలింగ్ పోలీసులు గనుక ఉంది ఉంటే, ఈ మానవ మృగాలు ఆ దుస్సాహసానికి ఒడిగట్టేవా?

పోనీ సాంకేతికత పంథాలో దూసుకుపోతున్న మన పోలీసులు కనీసం అక్కడి సీసీటీవీలూ పూర్తి చిత్రాలను కూడా అందించాలకేకపోయాయి. ఆ చిత్రాలు కూడా మసకగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరు విస్మయానికి గురి చేస్తుంది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఇక్కడ పర్యటించి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 

ఇక రెండో ప్రశ్న... పోలీసులు స్పందించిన తీరు. దిశా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు కేసును అత్యవసరంగా పరిగణించకుండా ఇది మా పరిధిలోకి రాదూ అని చేతులు దులుపుకోవడం, పైపెచ్చు ఆ సదరు బాధితురాలిని ఆమె తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడం మరీ దురదృష్టకరం. 

ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గొప్పలు చెప్పుకునే మన తెలంగాణ పోలీసులు ఇంత ఇన్ సెన్సిటివ్ గా ప్రవర్తించడం అందునా సహాయం కోసం అర్థించి వచ్చిన వారిపట్ల ఇలా ప్రవర్తించడం అమానుషం.

Also read: Justice for Disha: కేసీఆర్ తప్పటడుగులపై చూపుడు వేళ్లు

పోలీసులు ప్రజా సేవకులు, ప్రజల పన్నులనే పోలీసు వారు జీతాలుగా తీసుకుంటున్నారు. ఇక్కడ వారినేదో ప్రజలకు మెహర్బానీ చేయమని అడగడం లేదు. కనీసం వారి విధినన్నా సక్రమంగా నిర్వర్తించమని కోరుకోవడం సామాన్య వ్యక్తిగా మన తప్పా? కాదు ఇది మన హక్కు.

పోలీసులు గనుక సమయానికి స్పందించి, హై వే పెట్రోలింగ్, లోకల్ పోలీస్ లోకల్ సెక్యూరిటీ అందరూ గనుక అలెర్ట్ అయి ఉంటె సమయానికి స్పందించి ఉంటె ఈ ఘటన ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. పోలీసులు నక్సలైట్ల చెరలో ఉన్న వాళ్ళనే విడిపించగలిగినప్పుడు ఈ సాధారణ యువతిని కాపాడలేకపోయేవారా?

దుర్ఘటన జరిగిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. రాజకీయనాయకుల హోరు కూడా మొదలయ్యింది. ఈ రేపిస్టులను ఉరి తీయాల్సిందే, కొట్టి చంపాల్సిందేనంటూ పార్టీలకతీతంగా నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చూస్తున్న సామాన్య ప్రజలు చప్పట్లు కూడా కొడుతుంటారు. 

కొత్త చట్టాలను చేయాల్సిందే, చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిందేనంటూ ఢిల్లీ నుండి గల్లీ దాకా ఊకదంపుడు ఉపన్యాసాలను నాయకులు దంచి కొడతారు. చట్టాలు కఠినతరం చేయాల్సిందే.

నిర్భయ ఘటన తరువాతే నిర్భయ చట్టం వచ్చింది. చట్టాలతోపాటు మన నగరాలను ఎలా మరింత సురక్షితంగా చేయగలమో ఆలోచించాలి. ఇది ఇప్పుడు అత్యవసరంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన విషయం. 

మన నగరాలను మరింత సురక్షితంగా ఎలా చేయగలం...?

నగరాల్లో స్ట్రీట్ లైటింగ్ ను ప్రతి ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా ఎక్కడా చీకటి ప్రదేశమనేది ఉండకూడదు. అలాంటప్పుడు మహిళలకు ఒకింత రక్షణగా ఫీల్ అవుతారు. చీకటిలో నడుస్తున్నామనే భయం వారికి ఉండదు, వెలుతురులో ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే ఎవరైనా జంకుతారు కూడా. 

మరో అంశం సీసీటీవీలూ. వీటిని హైదరాబాద్ అంతటా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పార్కింగ్ ప్రదేశాల్లో ప్రధాన కూడళ్లలో, శివారు ప్రాంతాల్లో ప్రతి చోటా కూడా ఈ సీసీటీవీలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.

ఏదో ఏర్పాటు చేసామంటే చేసాము అన్నట్టుగా కాకుండా, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. మన మహానగరంలో ప్రస్తుతం కొన్ని సీసీటీవీ కెమెరాల ముందు తీనెటీగలు తేనె తుట్టెలోను ఏర్పాటు చేసుకున్నాయంటే, ఆ సీసీటీవీల పనితీరు ఎలాగుందో మనకు అర్థమవుతుంది. 

ఇక పోలీసుల విషయానికి వస్తే గస్తీని పెంచడం. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈ తరహా గస్తీలను ముమ్మరం చేయడం. కమ్యూనిటీ పోలీసింగ్ వంటి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టడం లాంటి  చర్యలను తీసుకోవాలి.

పోలీసు శాఖలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థుల ఖాళీలను యుద్ధప్రాతిపదికన నింపడం. ఒకవేళ గనుక దిశా తల్లితండ్రులు వెళ్లి ఫిర్యాదు చేసిన సమయంలో ఒక మహిళా పోలీసు గనుక ఉండి ఉంటే, ఆ సదరు మహిళకు కూతురు కనపడట్లేదని తల్లిదండ్రులు పడే బాధ ఖచ్చితంగా అర్ధమయ్యి ఉండేది. 

ఇక అసలు విషయం. రాత్రివేళల్లో, తెల్లవారుఝామున ప్రజా రవాణాను అత్యధికంగా అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే అర్థరాత్రి వేళా మహిళలు నిర్భయంగా ప్రయాణం చేయగలరు. ఢిల్లీలో మాదిరి బస్సుల్లో రాత్రివేళల్లో బస్సు మార్షల్స్ ని ఏర్పాటు చేయడం ఒక చెప్పదగిన సూచన. 

Also read: హైదరాబాద్ లో మారిన బస్సు వేళలు... ఉదయం 6తర్వాతే...

ఇలా మహానగరాలను ఆడవారికి సురక్షితంగా మార్చేందుకు కృషి చేయమని అడుగుతుంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారేమో మహిళా కండెక్టర్లు 8గంటలకల్లా విధులు ముగించుకోవాలి అంటున్నారు. ఏం రాత్రిపూట ఆడవారు డ్యూటీలు చేయకూడదా?

బస్సు వేళల్లో కూడా మార్పు తీసుకురాబోతున్నారు. రాత్రి 9.30 తరువాత బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే యోచనలో ఉంది కెసిఆర్ సర్కార్. ఢిల్లీలో నిర్భయ ఘటన జరగడానికి ప్రధాన కారణం... రాత్రివేళ ప్రజారవాణా అందుబాటులోలేక ప్రైవేట్ బస్సును సదరు నిర్భయ ఎక్కినందుకు అత్యంత క్రూరంగా ఆ యువతిని బలిగొన్నారు. 

బస్సుల సంఖ్యను రాత్రివేళ పెంచి ఉంటె ఆ సంఘటన జరిగి ఉండేదే కాదు. ఆ నిర్భయ ఘటన తరువాత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి.

హైదరాబాద్ విశ్వనగరంగా కీర్తి ప్రతిష్టలు సాధించాలని కళలు కనే కేసీఆర్ ఈ విషయమై పునరాలోచించాలి. యువనేత కేటీఆర్ అయినా ఈ విషయమై స్పందించాలని కోరుకుందాం. 

Follow Us:
Download App:
  • android
  • ios