Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు.. కేంద్రం కీలక ప్రకటన
Traffic Rules: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కీలక ప్రకటన చేశారు. ఇకపై పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు నెగెటివ్ పాయింట్లు
కొత్తగా ప్రతిపాదించిన విధానం ప్రకారం.. వాహనదారుడు చేసే ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు డ్రైవింగ్ లైసెన్స్, వాహనం RCపై పాయింట్లు తగ్గుతాయి. అంటే తప్పులు చేసిన కొద్దీ నెగెటివ్ పాయింట్లు పెరుగుతాయి. ఒక వాహనదారుడు నిర్దేశించిన పరిమితికి మించి నెగెటివ్ పాయింట్లు పొందితే అతని డ్రైవింగ్ లైసెన్స్ను కొంతకాలం సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఉల్లంఘనలు మరింత ఎక్కువైతే లైసెన్స్ను పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మంచి డ్రైవింగ్ రికార్డున్న వారికి ప్రయోజనాలు
కొత్త పాయింట్ల విధానం కేవలం తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడానికే కాకుండా.. బాధ్యతగా వాహనాలు నడిపే వారిని ప్రోత్సహించడానికి కూడా ఉపయోగపడుతుందని గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మంచి రికార్డు కలిగిన డ్రైవర్లకు భవిష్యత్లో కొన్ని ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ప్రయోజనాలు అందేలా విధానం తీసుకురావచ్చని మంత్రి తెలిపారు. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే వారికి మంచి పాయింట్లు ఉండేలా, పదేపదే తప్పులు చేసే వారికి నెగెటివ్ పాయింట్లు ఉండేలా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతో డ్రైవర్లలో బాధ్యత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
దేశవ్యాప్తంగా 1,600 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు
భారత్లో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల ప్రవర్తన కూడా ఒక ముఖ్య కారణమని నితిన్ గడ్కరీ అన్నారు. డ్రైవింగ్లో సరైన శిక్షణ లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 1,600 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో 112 కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాయని గడ్కరీ తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. పదేపదే తప్పులు చేసే డ్రైవర్లు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో స్పష్టంగా తెలియజేయడంతో పాటు, సరైన డ్రైవింగ్ పద్ధతులపై శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
భారత్ NCAP 2.0తో వాహనాల భద్రతపై మరింత దృష్టి
వాహన భద్రతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. భారత్ NCAP 2.0ను 2027 అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ విధానంలో వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికుల భద్రతతో పాటు ప్రమాదం జరిగిన మొత్తం భద్రతా వ్యవస్థను పరిశీలించేలా చర్యలు తీసుకోనున్నారు. భారత్లో ప్రతి ఏడాది సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. వీటిలో దాదాపు 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసున్నవారేనని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను ఏ విధంగానైనా తగ్గించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
పాత BS-IV వాహనాలకు కొత్త ఎమిషన్ కంట్రోల్ పరికరం
కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత BS-IV వాహనాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. వీటి ఉద్గారాలను నియంత్రించేందుకు కొత్త ఎమిషన్ కంట్రోల్ పరికరాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరికరం ధర సుమారు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఉండొచ్చని గడ్కరీ తెలిపారు. పరికరానికి సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని, దాన్ని వాహనాల్లో అమర్చిన తర్వాత ఉద్గారాలు BS-VI స్థాయికి తగ్గినట్లు ట్రయల్స్లో తేలిందని చెప్పారు.
మొత్తంగా చూస్తే.. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, బాధ్యతగా వాహనాలు నడిపేవారిని ప్రోత్సహించడం, డ్రైవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, వాహనాల భద్రతను పెంచడం, కాలుష్యాన్ని నియంత్రించడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

