Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Post Office: ఇప్పటి వరకు మీరు చాలా పోస్టు ఆఫీసులు చూసి ఉంటారు.. కానీ, నీటిపై తేలాడే పోస్ట్ ఆఫీస్ చూశారా? మన దేశంలో అది ఎక్కడ ఉందో తెలుసా? అసలు.. దీనిని ఎవరు వాడుతున్నారు?

Floating Post Office
మన దేశంలో 'పోస్టాఫీసు' అనగానే మైండ్ లోకి ఒక పాత భవనం, ఎర్రటి పోస్ట్బాక్స్, లేఖలను సార్ట్ చేసే ఉద్యోగులు గుర్తుకొస్తారు. కానీ, చుట్టూ నీళ్ళు, వెనక మంచు కొండల నడుమ హౌస్బోట్లో నీటిపై తేలియాడే పోస్టాఫీసును ఎప్పుడైనా చూశారా?
ఇది ఏదో సినిమా దృశ్యం లేదా ఊహాజనిత కథ కాదు! జమ్మూకశ్మీర్లోని ప్రసిద్ధ శ్రీనగర్ డల్ లేక్పై నిజంగానే ఒక 'ఫ్లోటింగ్ పోస్టాఫీస్' (Floating Post Office) అందుబాటులో ఉంది. ఇప్పటికీ సజావుగా పనిచేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టాఫీసు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం:
అసలు ఎక్కడ ఉంది?
శ్రీనగర్లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్బోట్లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు.
డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు.
ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు.
పోస్టులు గమ్యస్థానాలకు ఎలా చేరతాయి?
ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు.
70 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ చరిత్ర..
చాలామంది ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ 2011లోనే ప్రారంభమైందని అనుకుంటారు. కానీ, 2011లో జరిగింది కేవలం దాని పునరుద్ధరణ (Renovation) మాత్రమే. రికార్డుల ప్రకారం.. 1953లోనే డల్ లేక్ , జీలం నదిపై హౌస్బోట్లలో నివసించే ప్రజల కోసం 'ఫ్లోటింగ్ మొబైల్ పోస్టాఫీస్' సేవలు అందుబాటులోకి వచ్చాయి.
1954 నాటికే శ్రీనగర్లో ఇటువంటి తేలియాడే పోస్టాఫీసులు మూడు ఉండేవి. అంటే నీటిపై పోస్టల్ సేవలను అందించే ఆలోచనకు ఏకంగా 70 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉంది.
ఈ హౌస్బోట్ కేవలం పోస్టాఫీసుగా మాత్రమే కాక, ఒక 'ఫిలాటెలిక్ మ్యూజియం' (Philatelic Museum) గా కూడా సేవలందిస్తోంది. కశ్మీర్ చరిత్రకు సంబంధించిన అరుదైన పాత విక్రయ స్టాంపులు, ప్రత్యేక పోస్టల్ సామగ్రిని పర్యాటకులు ఇక్కడ సందర్శించవచ్చు.
2014లో జమ్మూ కశ్మీర్ను ముంచెత్తిన భారీ వరదలకు ఈ ఫ్లోటింగ్ హౌస్బోట్ దెబ్బతింది. కానీ, అధికారులు దీని ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళీ అత్యంత వైభవంగా పునరుద్ధరించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చారు.

