Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Goa Temple: గోవా అంటే బీచ్లు, నైట్ లైఫ్, పర్యాటక ప్రదేశాలే. కానీ ఏళ్ల చరిత్రను చెప్పే ఎన్నో పురాతన ఆలయాలూ ఉన్నాయి. గోవా వారసత్వానికి సజీవ సాక్ష్యాలివి. బాలీవుడ్ భామ భూమి గోవాలోని పురాతన అమ్మవారిని దర్శించడంతో వాటి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.

గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి
గోవా అంటే చాలా మందికి గుర్తొచ్చేవి బీచ్లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, పర్యాటక ప్రదేశాలే. కానీ గోవాలో వందల ఏళ్ల చరిత్రను చెప్పే ఎన్నో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఉత్తర గోవాలోని పెడ్నే ప్రాంతంలో ఉన్న శ్రీ దేవి మౌళి ఆలయం ఒకటి. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు...గోవా సంస్కృతి, వారసత్వానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది.
దుర్గాదేవి అవతారంగా మౌళి దేవి
ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే మౌళి దేవికి అంకితం చేశారు. ఫెడ్నేకర్ కుటుంబాలతో పాటు ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలు ఈ అమ్మవారిని తమ కులదేవతగా ఆరాధిస్తారు. ఆలయంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి సుమారు 400 ఏళ్లనాటి రాతి విగ్రహం. స్వచ్ఛమైన మంచినీటి ప్రవాహం పక్కనే ఈ విగ్రహం ఉంటుంది. ఆ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు.
పుట్టినరోజు సందర్భంగా కులదేవతను దర్శించుకున్న బాలీవుడ్ భామ
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తన 37వ పుట్టినరోజు సందర్భంగా తమ కులదేవత శ్రీ దేవి మౌళి ఆలయాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకోవడంతో..ఆలయం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.
మూడింటిని దర్శిస్తేనే యాత్ర కంప్లీట్
మహిషాసుర మర్దిని శిల్పం, పురాతన విగ్రహాలు, నంది సమేతంగా ఉన్న శ్రీ రామేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రానికి మరింత చారిత్రక ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. పెడ్నే ప్రాంతంలో భక్తులు సాధారణంగా మూడు ఆలయాలను దర్శించడం సంప్రదాయం. రావళ్నాథ్ ఆలయం. మౌళి దేవి ఆలయం, భగవతి దేవి ఆలయాలను వరుసగా దర్శిస్తేనే యాత్ర పూర్తైనట్లు భావిస్తారు. గ్రామ రక్షక దైవంగా భావించే రావళ్నాథ్ స్వామిని కొత్త ఇల్లు, కొత్తగా పెళ్లైన వారు వివాహం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు తప్పకుండా దర్శించుకోవడం ఆనవాయితీ.
ఇండో-పోర్చుగీస్ నిర్మాణశైలిలో ఆలయం
ఇండో-పోర్చుగీస్ నిర్మాణశైలిలో రూపొందిన ఈ ఆలయంలో కొంకణ్ ప్రాంతానికి ప్రత్యేకమైన కావి కళ అలకరణలు కనిపిస్తాయి. ఎర్రటి మట్టి పూతతో రూపొంది ఈ సంప్రదాయ కళ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చిన్న జలపాం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.
గోవా వారసత్వానికి సజీవ సాక్ష్యాలు
భగవతి దేవి ఆలయాన్ని సందర్శించి ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేస్తారు. ఈ మూడు ఆలయాలు గోవా ఆధ్మాత్మిక సంప్రదాయానికి, సాంస్కృతిక వారసత్వానికి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

