Marriage : ఇదెక్కడి విడ్డూరం..! అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టి పెళ్ళాడిందా!!
సాధారణంగా పెళ్లి అంటేనే వధువు మెడలో వరుడు తాళి కట్టి భార్యాాభర్తలుగా మారే తంతు. అదే వరుడి మెడలో వధువు తాళి కడితే..! ఇలాంటి వింత వివాహమే మన పొరుగురాష్ట్రం కర్ణాటకలో జరిగింది.

ఇదెక్కడి వింత పెళ్లి..!
సాధారణంగా పెళ్లిలో వధువు మెడలో వరుడు తాళి కట్టడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో వరుడి సోదరి అంటే ఆడపడుచు వధువు మెడలో తాళికట్టే సాంప్రదాయం కూడా ఉంటుంది… ఇలా ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓ వధువు మెడలో తాళికట్టిన వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక అబ్బాయి మేనమామ కూడా వధువుకు తాళికట్టే సాంప్రదాయం కొన్ని సామాజికవర్గాల్లో చూస్తుంటాం. అయితే ఎవరు కట్టినా తాళి అనేది అమ్మాయి మెడలోనే ఉంటుంది… ఇదే అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
కానీ కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లిలో సీన్ రివర్స్ అయ్యింది. విజయపుర జిల్లా నాలత్వాడ్ గ్రామంలో రెండు జంటలకు వినూత్న పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లిళ్లలో వధువులే తమ భర్తల మెడలో తాళి కట్టారు. అమిత్-ప్రియ, ప్రభురాజ్-అంకిత అనే ఈ రెండు జంటలు స్త్రీ-పురుష సమానత్వం అనే సందేశాన్ని ఇచ్చేందుకు ఇలా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
వధూవరుల నేపథ్యం ఏంటి?
ఈ వింత పెళ్లి చేసుకున్న అమిత్, ప్రియ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. అమిత్ లింగాయత్ వర్గానికి, ప్రియ కురుబ వర్గానికి చెందినవారు. మరో జంట ప్రభురాజ్, అంకిత కూడా వేర్వేరు వర్గాల వారే. ప్రభురాజ్ ఒక వ్యాపారవేత్త.
ఈ రెండు పెళ్లిళ్లలోనూ వధువులే వరుళ్ల మెడలో మంగళసూత్రం కట్టారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఇద్దరు పెళ్ళికొడుకులు ఒకే కుటుంబానికి చెందినవారు… అన్నదమ్ముల కొడుకులు. వీరి కుటుంబాలు సంఘ సంస్కర్త బసవన్న బోధనలను నమ్ముతాయి… అందుకే ఈ ఆదర్శ విహహం చేశారు.
తాళి కట్టడమే కాదు.. మార్చిన ఎన్నో సంప్రదాయాలు
ఈ పెళ్లి ప్రత్యేకత వరుడి మెడలో వధువు తాళి కట్టడంతోనే అయిపోలేదు. పెళ్లిళ్లలో ముఖ్యమైనదిగా భావించే జాతకాలు, ముహూర్తాలను కూడా వీరు నిర్ణయించుకోలేదు. అంతేకాదు అమ్మాయి కుటుంబసభ్యులు తమ బిడ్డను అప్పగించే కన్యాదానం లాంటి తంతును కూడా పక్కనపెట్టారు. చాలా నిరాడంబరంగా ఈ ఆదర్శ వివాహం చేసుకున్నారు. పెళ్లి అంటే అమ్మాయిని ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి 'అప్పగించడం' కాదని, భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనని తమ చర్యల ద్వారా ఈ జంటలు చాటిచెప్పాయి.
ఈ వినూత్న వివాహం వెనుక స్ఫూర్తి ఈయనే..
ఈ వినూత్న వివాహానికి 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవన్న బోధించిన సమానత్వ భావనలే ఆధారం. బసవన్న స్త్రీ-పురుష సమానత్వం, కుల వివక్షకు వ్యతిరేకత వంటి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించే కుటుంబాలకు చెందిన వారు కావడంతో, ఈ జంటలు తమ పెళ్లిలో కూడా అవే భావాలను ప్రతిబింబించాలని నిర్ణయించుకున్నారు. భర్త మాత్రమే కొన్ని కర్మకాండలు చేయాలనే లింగ ఆధారిత సంప్రదాయానికి బదులుగా… ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకోవడం ద్వారా వివాహ బంధంలో ఇద్దరికీ సమాన స్థానం ఉండాలనేదే తమ ఉద్దేశమని వారు తెలిపారు.
కట్నానికి ‘నో’...
కట్నం, అనవసరమైన పెళ్లి తంతులకు వ్యతిరేకంగా సందేశం ఇవ్వడం కూడా ఈ పెళ్లి మరో ముఖ్య ఉద్దేశం. భారీ ఖర్చులతో కాకుండా చాలా సింపుల్గా పెళ్లి చేసుకుని కులమత భేదాలు, కట్నం లాంటి సామాజిక దురాచారాలను అధిగమించాలని ఈ కుటుంబాలు చాటిచెప్పాయి.
వధువులు వరుళ్ల మెడలో తాళి కట్టిన ఆ క్షణంలో, వేలాది మంది బంధువులు, స్నేహితులు వారిని ఆశీర్వదించారు. బసవన్న సిద్ధాంతాలను అనుసరించే పలువురు మత పెద్దలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. 'పెళ్లి అంటే ఇలాగే ఉండాలి' అనే మూస పద్ధతిని పక్కనపెట్టి, ఇద్దరి సమానత్వాన్ని, ఇష్టాన్ని గౌరవించవచ్చని ఈ వింత పెళ్లి నిరూపించింది.

