Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
Nepal Floods: వానలు పడితే నదులు ఉప్పొంగి వరదలు రావడం సహజం. కానీ నేపాల్ లో పరస్థితి వేరు. వానలు పడకుండా నదికి వరదలు వచ్చాయి. అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకలా హఠాత్తుగా వరదలు వచ్చిపడ్డాయి?

నేపాల్ లో వరదలు ఎలా?
నేపాల్లో ఇటీవల సంభవించిన ఘోర వరదలకు వర్షాలు కారణం కాదు. సాధారణంగా భారీ వర్షాలు లేదా వరద హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమవుతారు. కానీ ఇక్కడ చుక్క వర్షం పడకుండానే నదులు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. ఈ విచిత్ర విపత్తు వెనుక దాగి ఉన్న అసలు సూత్రధారి ఆకాశం కాదు.. హిమాలయాల ఎత్తైన శిఖరాల్లో చోటుచేసుకున్న భారీ భౌగోళిక మార్పు. దాదాపు ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్టాంగ్ పర్వత శ్రేణుల్లో ఒక భారీ గ్లేసియర్ (హిమానీనదం) దానికి ఆనుకుని ఉన్న కొండచరియలతో సహా ఒక్కసారిగా నిలువునా విరిగిపడింది. ఈ శిథిలాలు ఎంత వేగంగా, ఎంత భారీ మొత్తంలో పడ్డాయంటే భూకంప మాపకాల్లో ప్రకంపనలు సైతం నమోదయ్యాయి. కొండలు విరిగి నదీ పరీవాహక ప్రాంతాల్లో పడటంతో ఈ అనూహ్య విలయం మొదలైంది.
కారణం ఇదే
కొండపై నుంచి విరిగిపడిన వేలాది టన్నుల మంచు దిబ్బలు, బండరాళ్లు, మట్టి ముద్దలు లోయలో ప్రవహించే నదిపై పడి క్షణాల్లో నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. దీనివల్ల నదికి సహజసిద్ధంగా ఒక తాత్కాలిక ఆనకట్టలా ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న నీరు నిమిషాల వ్యవధిలోనే భారీ జలాశయంగా మారి విపరీతమైన ఒత్తిడిని పెంచింది. నీటి ఉధృతికి ఆ మట్టి, రాళ్ల కట్ట ఒక్కసారిగా పేలిపోవడంతో ఆకస్మిక సునామీ వంటి బురద ప్రవాహం కిందకు దూసుకొచ్చింది. కేవలం అరగంట వ్యవధిలోనే నదీ మట్టం దాదాపు పది మీటర్ల మేర పెరిగిపోయింది. నదీ తీరంలో ఉన్న ఇళ్లు, వంతెనలు, స్థానిక నిర్మాణాలు ఏవీ ఈ ఉధృతికి నిలబడలేక కొట్టుకుపోయాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గ్రామాలు బురదమయంగా మారాయి.
గ్లోబల్ వార్మింగ్ వల్లే
ఈ విపత్తుకు అసలైన మూలకారణం గ్లోబల్ వార్మింగ్ అని పర్యావరణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వేల ఏళ్లుగా బండరాళ్లను ఒక జిగురులా గట్టిగా పట్టి ఉంచుతున్న శాశ్వత మంచు పొరలు (పెర్మాఫ్రాస్ట్) కరిగిపోతున్నాయి. దీంతో పర్వతాల పటుత్వం తగ్గి, పైన ఉన్న గ్లేసియర్లు ఏ క్షణానైనా జారిపడేంత అస్థిరంగా మారుతున్నాయి. వర్షం రాకపోయినా కేవలం వేడి పెరిగి పర్వతాల అంతర్భాగం బలహీనపడటం వల్లే ఈ భారీ ప్రళయం సంభవించింది. భవిష్యత్తులో వర్షాలు లేకపోయినా హిమాలయ ప్రాంతాల్లో ఇలాంటి ఆకస్మిక విపత్తులు తప్పవని ఈ సంఘటన తీవ్ర హెచ్చరిక జారీ చేస్తోంది.

