కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?
ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీలు తాగనిదే పని మొదలుపెట్టరు మన భారతీయులు. కానీ ఈ రెండు మనదేశానికి చెందినవేనా? ఇవి మనకు తెలియక ముందు ఉదయాన్నే ఏమి తాగేవారం? అసలు ఈ కాఫీ, టీలను మనకు ఎవరు పరిచయం చేశారు?

కాఫీ, టీలు లేనప్పుడు...
ఉదయం నిద్రలేచిన వెంటనే వేడివేడిగా టీ లేదా కాఫీ పొట్టలో పడాల్సిందే. ఆ తరువాతే పనులు చేయడం మొదలుపెడతారు. ఇప్పుడంటే మనకు కాఫీ, టీలు తెలుసు కానీ మన పూర్వీకులకు వీటి సంగతే తెలియదట. పూర్వీకులు ఉదయాన్నే శరీరానికి పోషణ, రోగనిరోధక శక్తినిచ్చే సహజ పానీయాలను తీసుకునేవారు. ప్రధానంగా ఆవు పాలు, గోరువెచ్చని నీటిలో కలుపుకున్న ఆవు నెయ్యి లేదా తేనె, తులసి, అల్లం, దాల్చినచెక్క, మిరియాలతో కాచిన మూలికా కషాయాలు తాగేవారు. దక్షిణ భారతదేశంలో రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు, మజ్జిగ పోసి పులియబెట్టిన చద్దన్నం తినడం చేసేవారు. ఇది పొట్టకు చలువ చేయడంతో పాటు సహజ ప్రోబయోటిక్స్ను అందించేది. గ్రామీణ ప్రాంతాల్లో తాజా మజ్జిగ, రాగి అంబలి, బార్లీ నీళ్లు వంటివి ఉదయం తాగేవారు. ఇవి వారికి శారీరక శ్రమకు అవసరమైన శక్తిని, చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు.
భారత్లోకి కాఫీ, టీల ప్రవేశం
కాఫీ భారతదేశానికి 16వ శతాబ్దం చివరలో లేదా 17వ శతాబ్దం ఆరంభంలో ప్రవేశించినట్టు చెబుతారు. బాబా బుదాన్ అనే సూఫీ సన్యాసి యెమెన్ దేశంలోని మోచా నగరం నుంచి ఏడు పచ్చి కాఫీ గింజలను తన వస్త్రంలో దాచి దొంగతనంగా భారత్కు తీసుకొచ్చారు. వాటిని కర్ణాటకలోని చిక్మగళూరు సమీపంలోని చంద్రద్రోణ పర్వతాలలో నాటారు. ప్రస్తుతం ఆ కొండలను బాబా బుదాన్గిరి అంటారు. మరోవైపు, ఈశాన్య భారత్లోని సింగ్ఫో తెగ ప్రజలు అడవి తేయాకులను ఔషధంగా వాడుతున్నప్పటికీ, బ్రిటీష్ పాలనలోనే టీ వాణిజ్య రూపం దాల్చింది. 1823లో రాబర్ట్ బ్రూస్ అనే స్కాటిష్ అధికారి అస్సాంలో స్థానిక టీ మొక్కలను గుర్తించారు. చైనాపై తేయాకు ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ 1830ల నుంచి అస్సాం, డార్జిలింగ్లలో విస్తారంగా తేయాకు తోటలను పెంచడం ప్రారంభించింది.
టీ, కాఫీలు అలవాటుగా ఎలా?
ప్రారంభంలో కాఫీ, టీలను ధనికులు, బ్రిటీష్ అధికారులకు తాగే అవకాశం ఉండేది. వీటిని అప్పట్లో విలాసవంతమైన పానీయాలుగా చెప్పుకునేవారు. 1903లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఇండియన్ టీ మార్కెట్ ఎక్స్పాన్షన్ బోర్డ్' బాగా ప్రచారాలను చేపట్టింది. రైల్వే స్టేషన్లు, ఫ్యాక్టరీలు, పట్టణ కూడళ్లలో ఉచితంగా టీ అందించడం, పాలు-చక్కెర కలిపి మరిగించే భారతీయ శైలి 'చాయ్' తయారీ విధానాన్ని ప్రోత్సహించడం చేసింది. అప్పుడు సామాన్యులకు కూడా టీ అలవాటు అయింది. అదే సమయంలో దక్షిణ భారతంలో ఫిల్టర్ కాఫీ నిత్య జీవితంలో భాగమైంది. అలా బ్రిటీష్ వాణిజ్య ప్రయోజనాల కోసం మొదలైన ప్రయాణం, క్రమంగా భారతదేశంలో ప్రతి ఉదయాన్ని కాఫీ, టీల సువాసనతో మేల్కొనేలా మార్చేసింది

