- Home
- Feature
- Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Rudraksha Shiva Puja Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివలింగానికి నీళ్లు ఏ దిశలో పోయాలి? కేవలం నీరు, మారేడు దళాలతో పూజ పూర్తవుతుందా? శివపురాణంలో ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.

రుద్రాక్ష ఏ ఆకారంలో ఉంటే మంచిది? శివపురాణంలో దాగిన అసలు నిజాలు ఇవే
పరమశివుని పూజ, రుద్రాక్ష ధారణ, అభిషేక నియమాలపై చాలామందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఏ దిశ వైపు ముఖం పెట్టి నిలబడాలి? పూజా సామగ్రి ఏమీ లేనప్పుడు కేవలం నీరు, మారేడు దళం సమర్పిస్తే పూజ పూర్తవుతుందా? ఇలాంటి ప్రశ్నలు భక్తుల మనసులో తరచూ మెదులుతుంటాయి.
ఈ సందేహాలన్నింటికీ శివపురాణంలోని కథలు, ప్రసంగాల ద్వారా స్పష్టమైన సమాధానాలు లభిస్తున్నాయి. శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయాలు, బ్రహ్మదేవుడు దేవతలకు ఉపదేశించిన నియమాలు, ఒక బోయవాని కథ ద్వారా ఈ విషయాలు స్పష్టమవుతాయి.
మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివుడు పార్వతికి చెప్పిన రహస్యమిదే
మహిళలు రుద్రాక్ష వేసుకోవచ్చా లేదా అనే విషయంలో ఎలాంటి అయోమయం అవసరం లేదు. శివపురాణం ప్రకారం రుద్రాక్ష కేవలం పురుషులకు లేదా సాధు సన్యాసులకు మాత్రమే పరిమితం కాదు. మహిళలు కూడా రుద్రాక్షను నిరభ్యంతరంగా ధరించవచ్చు.
పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి రుద్రాక్ష ఉత్పత్తి, దానిని ధరించే విధానం గురించి వివరించారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం తాను వేల సంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సు చేశానని, తపస్సు ముగించి కళ్లు తెరిచినప్పుడు తన కళ్ల నుంచి నీటి బొట్లు నేలపై పడ్డాయని శివుడు తెలిపారు. ఆ అశ్రు బిందువుల నుంచే రుద్రాక్ష చెట్లు ఉద్భవించాయి. తన భక్తుల సంక్షేమం, శ్రేయస్సు కోసమే తాను రుద్రాక్షలను ఇచ్చినట్టు శివుడు చెప్పాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
'స్త్రీశూద్రాణాం శివాజ్ఞయా' - రుద్రాక్ష అందరికీ సమానమే
రుద్రాక్ష ధరించే హక్కు అందరికీ ఉందంటూ, 'స్త్రీశూద్రాణాం శివాజ్ఞయా' అని ప్రత్యేకంగా మహా శివుడు ప్రస్తావించారు. అంటే మహిళలు కూడా రుద్రాక్ష ధరించవచ్చని పరమశివుని ఆజ్ఞ అని అర్థం.
శివుడు పార్వతికి రుద్రాక్షలలోని రకాలు, వాటిని ఎలా గుర్తించాలి, ఏ పరిమాణంలో ఉండే రుద్రాక్ష శ్రేష్ఠమైనది, ఎలాంటి రుద్రాక్షలను ధరించకూడదు, శరీరంలో ఏ ఏ భాగాలలో ఎన్ని రుద్రాక్షలు ధరించాలో వివరంగా వివరించాడు. అలాగే రుద్రాక్ష ధరించే శివభక్తులను గౌరవించే విధానాన్ని కూడా శివుడు తెలియజేశారు.
శివలింగానికి నీళ్లు పోసేటప్పుడు ఏ దిశలో నిలబడాలి?
శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలనే దానిపై బ్రహ్మదేవుడు రుషులకు, దేవతలకు సరైన దిశను వివరించాడు. శివలింగానికి పూజ చేసేటప్పుడు ఉత్తర దిశ వైపు ముఖం ఉంచి నిలబడటం లేదా కూర్చోవడం చాలా శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి.
తూర్పు దిశ వైపు ముఖం పెట్టి అభిషేకం చేయడం లేదా దక్షిణ దిశలో నిలబడి నీళ్లు పోయడం సరైన పద్ధతి కాదని పేర్కొంటారు. ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల పూజా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది.
కేవలం నీరు, మారేడు దళంతో పూజ పూర్తవుతుందా?
పూజకు అవసరమైన ఏ ఇతర పదార్థాలు, ఆడంబరాలు లేకపోయినా కేవలం ఒక చిన్న పాత్రతో నీరు, ఒక మారేడు దళం సమర్పిస్తే చాలు శివుడు ప్రసన్నుడవుతాడని శివపురాణంలో ఒక వేటగాని కథ ద్వారా తెలుస్తుంది.
అడవిలో ఒక వేటగాడు తెలియకుండానే రాత్రి వేళ చెట్టుపై నుంచి శివలింగంపై నీటి చుక్కలు, మారేడు ఆకులను పడేలా చేస్తాడు. ఎలాంటి అడంబరాలు లేకుండా, కేవలం అనుకోకుండా పడిన ఆ నీరు, మారేడు ఆకులకే పరమశివుడు ప్రీతి చెంది ఆ వేటగానికి ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి నిశ్చలమైన భక్తితో సమర్పించే నీరు, బిల్వపత్రం శివ పూజను సంపూర్ణం చేస్తాయి.
శివ ఆరాధనలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
శివుడు భోళాశంకరుడు. ఆడంబరాల కంటే భక్తుల అంతఃకరణ శుద్ధి, నిష్టకే ప్రాధాన్యం ఇస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి.
• మహిళలు ఎలాంటి అపోహలు లేకుండా రుద్రాక్ష ధరించవచ్చు.
• అభిషేకం సమయంలో ఉత్తర దిశ ప్రాధాన్యం గుర్తుంచుకోవాలి.
• పూజా సామగ్రి కొరత ఉన్నా నీరు, బిల్వపత్రంతో శివారాధన పూర్తి చేయవచ్చు.

