- Home
- Sports
- Cricket
- Gill And Rahul: 48 ఏళ్లలో ఇదే తొలిసారి.. మాంచెస్టర్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, గిల్
Gill And Rahul: 48 ఏళ్లలో ఇదే తొలిసారి.. మాంచెస్టర్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, గిల్
Gill and Rahul create record partnership: మాంచెస్టర్ టెస్టులో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటతో మెరిశారు. మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యంతో 48 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

మాంచెస్టర్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో భారత్ కు బిగ్ షాక్
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతోంది. ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భారత జట్టును తీవ్ర ఒత్తిడిలో నెట్టింది.
భారత్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ల వికెట్లు కోల్పోయింది. వరుసగా రెండు బంతుల్లోనే వీరిద్దరూ డకౌట్ కావడం గమనార్హం. స్కోర్బోర్డ్పై ఒక్క పరుగు కూడా లేకుండానే భారత్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
KNOW
శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
ఇలాంటి కష్ట సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 1977 తర్వాత తొలిసారి ఒక జంట టెస్ట్ క్రికెట్లో 0/2 తర్వాత మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది.
టెస్ట్ క్రికెట్లో 0/2 పరుగులతో నుంచి 100+ మూడవ వికెట్ భాగస్వామ్యాలు ఇవే:
174* పరుగులు: కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ vs ఇంగ్లండ్ (2025)
105 పరుగులు: మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ vs ఆస్ట్రేలియా (1977/78)
102 పరుగులు: ఆర్చీ మ్యాక్లారెన్, స్టాన్లీ జాక్సన్ (ఇంగ్లండ్) vs ఆస్ట్రేలియా (1902)
కేఎల్ రాహుల్ మరో ఘనత
కేఎల్ రాహుల్ 9000 అంతర్జాతీయ పరుగుల మార్క్ను చేరుకున్నాడు. ఇది సాధించిన 16వ భారత ఆటగాడు. రాహుల్ టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్లో 2000 బంతులు ఎదుర్కొన్న రెండో ఓపెనర్గా సునీల్ గవాస్కర్ తర్వాత స్థానం పొందాడు. అదేవిధంగా ఓ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్లో 4 సార్లు 50+ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
విరాట్ కోహ్లీని అధిగమించిన శుభ్ మన్ గిల్
శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఇంగ్లాండ్పై ఒకే టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లిని అధిగమించాడు. అలాగే ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్గా నిలిచాడు.
మాంచెస్టర్ లో ఇక పోరాటమే మిగిలింది !
నాలుగో రోజును భారత జట్టు 174/2 పరుగులతో ముగించింది. ఇంకా 137 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలింగ్ విభాగం రాణించకపోవడంతో ఇంగ్లాండ్ 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (87* పరుగులు), శుభ్మన్ గిల్ (78* పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్తో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్, కేఎల్ రాహుల్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. “ఇది గొప్ప ఆటగాడి లక్షణం” అని ప్రశంసలు కురిపించారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ నాక్ సూపర్ అని పేర్కొన్నారు.