- Home
- Telangana
- Weather Update: తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజులు వర్షాలు కురిసే అవకాముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో ఎల్ నినో ప్రభావం పై రైతులను అలర్ట్ చేసింది.

ఆగస్టు 18 నుండి 23 వరకు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్?
వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. తలపై దట్టమైన నల్లటి మేఘాలు కనిపిస్తున్నా.. తీరా చూస్తే వర్షం పడకుండానే అలా గాలిలో కొట్టుకుపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఎల్ నినో కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలను ఐఎండీ ప్రస్తావించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తెలంగాణకు 6 రోజుల అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావంతో ఆగస్టు 18 నుంచి 23 వరకు అంటే మొత్తం 6 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ (IMD) తెలిపింది.
ఆగస్టు 17 నుంచి 21 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి?
ఆకాశం నిండా మేఘాలు ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల పొడి వాతావరణమే వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడాలంటే గాలిలో కనీసం 70% తేమ ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర జిల్లాల్లో 60% తేమ ఉంటే, మిడిల్, సౌత్ జిల్లాల్లో కేవలం 42% మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 19న ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు కురవవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో తేమ శాతం 40% కంటే తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆగస్టు 19న తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది.
ప్రజలకు, మత్స్యకారులకు ప్రభుత్వ హెచ్చరికలు
బంగాళాఖాతం తీవ్రంగా కల్లోలంగా ఉన్నందున ఆగస్టు 19 వరకు మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
ఇక వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు బయటకు రావద్దని.. ఒకవేళ బయట ఉంటే చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, భారీ హోర్డింగ్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ బృందాలు (SDMF) తెలిపాయి.
ఎల్ నినో పంజా.. అంటార్కిటికా మంచు కూడా కరిగిపోతోంది
ఇప్పుడు ముంచుకొస్తున్న అతిపెద్ద ముప్పు 'ఎల్ నినో'. ఇది మామూలు ఎల్ నినో కాదు.. అత్యంత తీవ్రమైనదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిసెంబర్ నాటికి దీని ప్రభావం పీక్స్ కి చేరుతుందని ప్రపంచ వాతావరణ పరిశోధకులు తెలిపారు.
దీని ప్రభావం వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తీవ్రంగా వేడెక్కిపోతున్నాయి. ఎంతలా అంటే.. అంటార్కిటికాలో మంచు ముక్కలై కరిగి హిందూ మహాసముద్రంలో కలిసిపోతోంది. సముద్ర ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల మత్స్యకారులకు చేపల వేట కూడా కష్టంగా మారింది. ఒకవైపు 'లాలా' తుపాను గంటకు 110 కిమీ వేగంతో గాలులతో విరుచుకుపడుతుంటే, మరో మూడు అల్పపీడనాలు కూడా లైన్లో ఉన్నాయి.
భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత.. రైతులకు బిగ్ షాక్
డిసెంబర్లో మనకు వర్షాకాలం కాదు కదా.. అప్పుడు ఎల్ నినో తీవ్రమైతే మనకేంటి నష్టం అనుకుంటే పొరపాటే.
1. ఎల్ నినో వల్ల ఇప్పుడు వర్షాలు సరిగా పడవు.
2. సెప్టెంబర్లో వచ్చే ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీనపడతాయి.
3. వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు దారుణంగా పడిపోతాయి.
4. దీని ప్రభావం వల్ల రాబోయే వేసవిలో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుంది.
5. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగునీటి సమస్య రెట్టింపు అవుతుంది.

