Jio: ఇంతింతై జియో అయ్.. పదేళ్లలో తెలుగు రాష్ట్రాలపై జియో సంచలన ప్రభావం
Jio: దేశ టెలికం రంగంలో జియోది ప్రత్యేక స్థానం. ఇంతింతై వటుడింతయై అన్నట్లు జియో వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. 2016లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించిన తర్వాత భారత టెలికాం రంగంలో భారీ మార్పులు వచ్చాయి. ఈ 10 ఏళ్ల ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.

2016లో డేటా అంటేనే ఖరీదైన వ్యవహారం
2016లో భారతదేశంలో ఒక మొబైల్ వినియోగదారు నెలకు సగటున 0.2 జీబీ కంటే తక్కువ డేటాను మాత్రమే ఉపయోగించేవారు. అప్పట్లో ఒక జీబీ డేటాకు సుమారు రూ.228 వరకు ఖర్చయ్యేది. 4G సేవలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 1 కోటి కంటే తక్కువగా ఉండేది. సగటు డౌన్లోడ్ వేగం కూడా 2.5 Mbps దాటేది కాదు. ఈ పరిస్థితుల్లో 2016 సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. తక్కువ ధరలకు హైస్పీడ్ డేటాను అందించడం ద్వారా మార్కెట్లోకి వచ్చింది. దీంతో డేటా వినియోగంపై ప్రజల ఆలోచనా విధానమే మారిపోయింది. 2026 నాటికి ఒక జీబీ డేటా ధర సుమారు రూ.7.9కి పడిపోయింది. అంటే 2016తో పోలిస్తే దాదాపు 97 శాతం తగ్గింది. దేశంలో 4G, 5G వంటి హైస్పీడ్ సేవలను ఉపయోగించే వారి సంఖ్య సుమారు 93.8 కోట్లకు చేరింది. జియో నెట్వర్క్లో ఒక వినియోగదారు నెలకు సగటున 42.3 జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. 3.25 కోట్లకు చేరిన యూజర్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపిన టెలికాం సర్కిల్లో జియో ఎదుగుదల మరింత ఆసక్తికరంగా ఉంది. 2016 ఆగస్టులో జియోకు ఇక్కడ ఎలాంటి యూజర్లు లేరు. వాణిజ్య సేవలు ప్రారంభించిన 2016 సెప్టెంబర్లోనే 12.4 లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. అక్కడి నుంచి జియో వేగంగా విస్తరించింది. 2026 జూన్ నాటికి తెలుగు రాష్ట్రాల టెలికాం సర్కిల్లో జియో యూజర్ల సంఖ్య ఏకంగా 3.258 కోట్లకు చేరింది. పదేళ్లలో 313.4 లక్షల మంది కొత్త యూజర్లు జియో నెట్వర్క్కు చేరారు. ఈ కాలంలో జియో వృద్ధి రేటు 39.9 శాతంగా నమోదైంది. 2024 జూన్లో జియో ఈ ప్రాంతంలో అత్యధికంగా 330.7 లక్షల మంది వినియోగదారుల స్థాయికి చేరింది. 2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మొత్తం 883 లక్షల వైర్లెస్ కనెక్షన్లు ఉండగా, అందులో జియో వాటా 36.9 శాతంగా ఉంది. దీంతో జియో తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా కొనసాగుతోంది.
ప్రత్యర్థులపై ప్రభావం.. టెలికాం రంగంలో భారీ మార్పులు
జియో రాకతో టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రంగా మారింది. 2016లో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, BSNLతో పాటు పలు చిన్న సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో చిన్న కంపెనీలు మార్కెట్ నుంచి తప్పుకోవడం, విలీనాలు జరగడం, కొంతమంది ఆపరేటర్లు సేవలను నిలిపివేయడంతో టెలికాంరంగం కొద్దిమంది పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లింది.
జియో 2019 జనవరిలో వోడాఫోన్ ఐడియాను అధిగమించింది. అదే ఏడాది అక్టోబర్లో ఎయిర్టెల్ను కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కొంతకాలం అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఎయిర్టెల్ తిరిగి మొదటి స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ జియో రెండో స్థానంలో బలంగా కొనసాగింది. 2016 ఆగస్టులో ఎయిర్టెల్కు 241.7 లక్షల మంది యూజర్లు ఉండగా, 2026 జూన్ నాటికి ఆ సంఖ్య 394.1 లక్షలకు చేరింది. వోడాఫోన్, ఐడియా కలిపిన వినియోగదారుల సంఖ్య 228.6 లక్షల నుంచి 87.3 లక్షలకు పడిపోయింది. BSNL వినియోగదారులు 97.5 లక్షల నుంచి 75.8 లక్షలకు తగ్గారు. 2016లో 164.1 లక్షల యూజర్లు ఉన్న ‘ఇతర’ చిన్న ఆపరేటర్ల విభాగం కూడా 2019 నాటికి దాదాపు పూర్తిగా కనుమరుగైంది.
చౌక డేటాతో మారిన ప్రజల జీవన విధానం
డేటా ధరలు తగ్గడం కేవలం మొబైల్లో వీడియోలు చూసే అలవాటును మాత్రమే మార్చలేదు. విద్య, వ్యాపారం, డిజిటల్ చెల్లింపులు, వినోదం వంటి అనేక రంగాలపై ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం సాధారణమైంది. విజయవాడలోని పండ్ల వ్యాపారి నుంచి వరంగల్లోని టీ దుకాణం వరకు చిన్న వ్యాపారులు UPI QR కోడ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. చిన్న పట్టణాల్లోని విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ రూపొందించే క్రియేటర్లకు కూడా కోట్లాది మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం వచ్చింది.
చిన్న వ్యాపారాలు మొబైల్ ద్వారానే కస్టమర్లను చేరుకోవడం, ప్రకటనలు ఇవ్వడం, చెల్లింపులు తీసుకోవడం, స్టాక్ను నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాయి. ఈ డిజిటల్ విస్తరణకు మరో ఉదాహరణ డిజిటల్ వాలెట్లు, OTT సేవల పెరుగుదల. 2016లో చాలా తక్కువగా ఉన్న డిజిటల్ వాలెట్ వినియోగదారుల సంఖ్య FY2026 నాటికి 55.6 కోట్లకు చేరింది. OTT ప్రేక్షకుల సంఖ్య కూడా 2016లో సుమారు 3 కోట్ల నుంచి FY2026 నాటికి 60.1 కోట్లకు పెరిగింది.
5G నుంచి బ్రాడ్బ్యాండ్ వరకు.. జియో కొత్త దిశ
4G తర్వాత జియో 5G సేవలపై కూడా భారీగా దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 5G సేవలు 2019 ప్రాంతంలో ప్రారంభం కాగా, జియో 2022 చివర్లో వాణిజ్య 5G సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5G కవరేజీని కేవలం 15 నెలల్లో పూర్తి చేసినట్లు రిపోర్టులో పేర్కొంది. వాణిజ్య 5G సేవలు ప్రారంభించిన 42 నెలల్లో సుమారు 26.8 కోట్ల మంది 5G వినియోగదారులను జియో సంపాదించింది.
జియో తన సొంత క్లౌడ్ ఆధారిత 5G టెక్నాలజీ, నెట్వర్క్ వ్యవస్థలు, రేడియో సిస్టమ్స్ను అభివృద్ధి చేసింది. సంస్థ పరిశోధన, టెక్నాలజీ విభాగంలో 11,303 మంది పనిచేస్తున్నారని, 4G, 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో 6,817 పేటెంట్లు దాఖలు చేసినట్లు కథనం పేర్కొంది. ఇక ఇంటర్నెట్ సదుపాయం ఉన్నప్పటికీ ఖరీదైన స్మార్ట్ఫోన్ కొనలేని వారి కోసం తక్కువ ధరలో జియోభారత్ ఫీచర్ ఫోన్ను తీసుకొచ్చింది. UPI చెల్లింపులు, HD వాయిస్, కెమెరా, స్ట్రీమింగ్ వంటి సదుపాయాలను ఇందులో అందించింది.
హోమ్ బ్రాడ్బ్యాండ్ రంగంలోనూ జియో వేగంగా విస్తరించింది. 2026 మార్చి 31 నాటికి జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 2.7 కోట్లను దాటింది. దీంతో భారత్లో అతిపెద్ద హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్గా నిలిచింది. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో కార్యకలాపాల ఆదాయం రూ.1,46,885 కోట్లుగా, EBITDA రూ.76,255 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా జియో యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 52.44 కోట్లకు చేరింది.
మొత్తంగా చూస్తే 2016లో చౌకైన మొబైల్ కనెక్టివిటీతో ప్రారంభమైన జియో ప్రయాణం ఇప్పుడు 4G, 5G, ఫైబర్ బ్రాడ్బ్యాండ్, చౌకైన పరికరాలు, క్లౌడ్, IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు విస్తరించింది. ఈ మార్పు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటర్నెట్ను ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.

