EV Bike Subsidy : ఈ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఇ-బైక్ పై ఏకంగా లక్ష రూపాయల సబ్సిడీ
ఉద్యోగం చేసే మహిళలు, కాలేజీ విద్యార్థినులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం 75% లేదా రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇస్తోంది. మహిళల భద్రత, విద్య, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం.

మహిళలకు గుడ్ న్యూస్
మహిళల చదువు, ఉద్యోగం, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం 'ముదల్వరిన్ పుదుమై పెణ్ స్కీమ్' అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళా ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు ఇ-బైక్ కొనేందుకు 75% లేదా గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు సబ్సిడీ పొందవచ్చు. మహిళా సాధికారత, సురక్షిత ప్రయాణంతో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఏ అర్హతలుండాలి?
ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళలు కొన్ని అర్హతలు ఉండాలి.
- దరఖాస్తుదారులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారై ఉండాలి.
- పుదుచ్చేరిలో కనీసం 5 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి.
- వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
- తప్పనిసరిగా టూ-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకు ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఈ పత్రాలు ఉండాలి
భారీ సబ్సిడితో స్కూటీని పొందేందుకు ముందుకు అప్లై చేసుకోవాలి. ఈ సమయంలో జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం అసలు ఇన్వాయిస్ సమర్పించాలి. ఉద్యోగం చేసే మహిళలు EPF/ESI కార్డ్, జీతం స్లిప్ లేదా ఇ-శ్రమ్ కార్డ్ను జతచేయాలి. విద్యార్థినులు కాలేజీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకానికి ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలనుకునేవారు పుదుచ్చేరి ప్రభుత్వ ఇ-డిస్ట్రిక్ట్ పోర్టల్లో 'ముదల్వరిన్ పుదుమై పెణ్ స్కీమ్ ఫర్ ఇ-స్కూటర్ సబ్సిడీ' లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే, పుదుచ్చేరి ఆది ద్రావిడర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ఉచితంగా దరఖాస్తు ఫారం తీసుకుని, నింపి సమర్పించవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు?
అధికారులు దరఖాస్తులను పరిశీలించి 'ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం' పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వాహనం కొన్న తర్వాత దాని అసలు ఇన్వాయిస్ను సమర్పించగానే, సబ్సిడీ డబ్బును నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో DBT పద్ధతిలో జమ చేస్తారు. అయితే సబ్సిడీ పొందిన వాహనాన్ని కొన్న 5 ఏళ్ల వరకు అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం చేయకూడదు. ఈ అద్భుత అవకాశాన్ని అర్హులైన మహిళలు, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవచ్చు.

