Shrimad Bhagavatam: ఇప్పుడు ఆధ్యాత్మిక కథలతో సినిమాల ఊపందుకుంటున్నాయి. వరుసగా సినిమాలు వస్తున్నాయి. అందులో భాగంగా విష్ణువు రూపాలను బేస్‌ చేసుకొని ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. మొదటి భాగంగా `శ్రీమద్భాగవతం` మూవీ రాబోతుంది.

భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పురాణ గాథలకు మరోసారి సరికొత్త రూపం ఇవ్వబోతోంది సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒకప్పుడు ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో భారతీయ టెలివిజన్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని వెండితెరపై మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ` పేరుతో ఓ లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించడం ద్వారా భారతీయ పురాణ కథనాన్ని ఒక విస్తృతమైన సినీ విశ్వంగా ఆవిష్కరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

రామాయణంతో మొదలైన వారసత్వానికి మరో కొత్త అధ్యాయం

భారతీయ పురాణాలు, ఆధ్యాత్మికత, సంస్కృతిని ప్రేక్షకులకు చేరువ చేయడంలో సాగర్ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దివంగత దిగ్గజ దర్శకుడు డా. రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ భారతీయ టెలివిజన్ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచింది. అనంతరం ‘శ్రీ కృష్ణ’ వంటి ప్రాజెక్టులు కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఆ కథలు కేవలం టెలివిజన్ కార్యక్రమాలుగా మాత్రమే మిగలలేదు. అవి భారతీయ కుటుంబాల సాంస్కృతిక జ్ఞాపకాల్లో భాగమయ్యాయి. ఇప్పుడు అదే వారసత్వం కొత్త తరానికి చేరుతోంది. అయితే ఈసారి టెలివిజన్ తెరపై కాదు.. భారీ స్థాయి థియేట్రికల్ సినిమాగా. ‘శ్రీమద్భాగవతం’ ద్వారా సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తన తదుపరి సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.

ఏడు భాగాల్లో ఓ మహత్తర ఆధ్యాత్మిక గాథ

శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. అనేక పాత్రలు, కథలు, ఆధ్యాత్మిక భావనలు, భక్తి సంప్రదాయాలు ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. ఇంతటి విస్తారమైన కథను ఒకే సినిమాలో చెప్పడం కంటే.. ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ‘విష్ణురథ’ ఈ ఏడు భాగాల ప్రయాణానికి తొలి అధ్యాయం కానుంది. ఈ ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్‌కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు. ఇది కేవలం ఒక కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడం మాత్రమే కాదు. గతంలో భారతీయ టెలివిజన్‌లో పురాణ కథలకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు అదే కథన సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికత, భారీ నిర్మాణ విలువలు, థియేట్రికల్ అనుభూతితో మళ్లీ ఆవిష్కరించబోతోంది.

నేషనల్ అవార్డ్ విజేత అమృత్ సాగర్

అమృత్ సాగర్‌కు సినిమా రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన ‘1971’ హిందీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను అందుకుంది. టెలివిజన్, సినిమా రెండు రంగాల్లోనూ అనుభవం ఉన్న అమృత్ సాగర్.. ఇప్పుడు తన సోదరుడు ఆకాశ్ సాగర్ చోప్రాతో కలిసి ఇంతటి భారీ స్థాయి ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. అందువల్ల ‘శ్రీమద్భాగవతం’లో కుటుంబ వారసత్వంతో పాటు అనుభవం, కొత్త ఆలోచన, ఆధునిక సినీ దృష్టికోణం కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ నిర్మాణం

‘శ్రీమద్భాగవతం’ను కేవలం కథ పరంగా మాత్రమే కాకుండా నిర్మాణ పరంగానూ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ ప్రాజెక్ట్ ముహూర్త కార్యక్రమం జరగడం, అక్కడే కీలకమైన నిర్మాణ పనులు, షూటింగ్‌ను నిర్వహించడం ఈ సినిమా స్కేల్‌ను తెలియజేస్తోంది. భారీ సెట్స్, విస్తృతమైన ప్రొడక్షన్ డిజైన్, లైవ్-యాక్షన్ షూటింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను సమన్వయం చేస్తూ పురాణ కాలాన్ని ప్రేక్షకులకు ఒక కొత్త విజువల్ అనుభూతిగా అందించే ప్రయత్నం జరుగుతోంది.

భారతీయ కథకు అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యం

ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేసిన క్లైడ్ ఎడ్వర్డ్స్ వంటి టెక్నికల్ ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్ట్‌తో భాగమవుతున్నారు. Life of Pi, The Jungle Book, Game of Thrones వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులతో అనుభవం ఉన్న ఆయన వంటి సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ‘శ్రీమద్భాగవతం’ విజువల్ ప్రపంచంపై ఉన్న దృష్టిని తెలియజేస్తోంది. అయితే సాంకేతికతే ఈ సినిమాకు అంతిమ లక్ష్యం కాదు. ప్రాచీన భారతీయ కథను ఆధునిక టెక్నాలజీతో ఆవిష్కరించేటప్పుడు.. ఆ కథకు ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్వరూపాన్ని కాపాడుతూ ప్రేక్షకులకు ఒక నమ్మదగిన, ఇంప్రెసివ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడమే అసలు సవాలు.

కేవలం మరో పౌరాణిక చిత్రం కాదు

‘శ్రీమద్భాగవతం’ను కేవలం మరో పౌరాణిక, భక్తి చిత్రంగా చూడటం ఈ ప్రాజెక్ట్ పరిధిని తగ్గించినట్లే అవుతుంది. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి చెందిన ఒక మహత్తర గ్రంథాన్ని.. నేటి తరానికి సరిపోయే ఆధునిక సినిమా భాషలో చెప్పే ప్రయత్నం ఇది. కొత్త తరానికి ఆ కథను కొత్త అనుభూతిగా పరిచయం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. `శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ` ఫస్ట్ లుక్ ఈ భారీ సినిమాటిక్ ప్రయాణానికి తొలి సంకేతంగా నిలుస్తోంది. ఒకవైపు రామానంద్ సాగర్ స్థాపించిన గొప్ప కథన వారసత్వం.. మరోవైపు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తదుపరి తరం దర్శకులు.. ఇంకోవైపు భారీ స్థాయి ప్రొడక్షన్, ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యం. ఈ అంశాలన్నీ కలిసినప్పుడు ‘శ్రీమద్భాగవతం’ భారతీయ పురాణ కథనాన్ని కొత్త స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంగా మారుతుందని చిత్ర బృందం వెల్లడించింది.