Asianet News TeluguAsianet News Telugu

నిధులిచ్చి ఆదుకోండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వాలని పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

ap cm ys jagan met pm narendramodi
Author
New Delhi, First Published Aug 6, 2019, 9:06 PM IST

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. రెండు రోజులపర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 

సుమారు 45 నిముషాల పాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు. 

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మోదీకి వివరించారు. తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు మరింత చేయూతనివ్వాలని కోరారు. కేంద్రం అందించాల్సిన సహాయసహకారాలను అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెురుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్దిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. పాదర్శకత, అవినీతి రహిత పాలనకోసం ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు మోదీకి వివరించారు. 

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని విద్యుత్‌ రంగంలో అస్తవ్యస్త విధానాలను సవరించినట్లు చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని దాటి విద్యుత్ ను కొనుగోలు చేశారని అందుకు సంబంధించి వివరాలను మోదీకి అందజేశారు.  

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పక ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు చేసుకున్నారని ఫలితంగా గ్రిడ్‌ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారని ఆరోపించారు. 

గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రూ.20వేల కోట్ల రూపాయల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం  విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపలేమని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే ఛార్జీలు భారీగా ఉన్నాయని ప్రధానికి వివరించారు.

మరోవైపు విభజన కారణంగా రాష్ట్ర ఆదాయాలకు గండిపడిందని తెలిపారు. 2014–15 నాటికి రూ. 97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు పెరిగిపోయాయని స్పష్టం చేశారు.  

వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2100 కోట్లు అందాల్సి ఉండగా కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు. 

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు విడుదల చేయాలని మోదీని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్.  పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నామని అందుకు సాయం చేయాలని కోరారు.  

గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడమే ధ్యేయంగా పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని అందుకు సహకరించాలని కోరారు.  

కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించేందుకు గోదావరిలో వరదజలాలను తరలించాల్సిన అవసరం ఉందన్నారు. 

అందువల్ల గోదావరి–కృష్ణా అనుసంధానానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పరం ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

2050నాటికి ప్రజల అవసరాలు తీర్చేలా వాటర్ గ్రిడ్‌ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీకి వివరించారు సీఎం జగన్. వాటర్ గ్రిడ్ నిర్మాణానికి సుమారు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అందుకు సహకరించాలని కోరారు. 

మరోవైపు ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సెక్‌ డేటా సరిగ్గా లేకపోవడంవల్ల కేంద్రం కేవలం 10.87లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసిందని తెలిపారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. 

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వాలని పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే పదేళ్ల పాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు,10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రియంబర్స్‌మెంట్‌, రెవెన్యూ లోటు రూపేణా రూ.22,948 కోట్లను పూడ్చాల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. 

పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయాలని సూచించారు. 

కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతానికి చాలా అవసరమంటూ చెప్పుకొచ్చారు. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతమని అలాగే పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. 

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలని ప్రధానిని కోరారు. మరోవైపు పునర్విభజన చట్టంలోని ఇచ్చిన హామీలో భాగంగా దుగ్గరాజపట్నం వద్ద పోర్టును నిర్మించాలని అది సాధ్యం కాదని చెప్పిన నేపథ్యంలో రామాయపట్నంలో పోర్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇకపోతే రాజధాని నిర్మాణంకోసం రూ. 2500 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పటి వరకు రూ.1500 కోట్లు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు మోదీకి వివరించారు.. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కోరతామని వైయస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీతో విన్నవించుకున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ

హస్తినలో సీఎం జగన్: పీఎంవో అధికారులతో భేటీ

Follow Us:
Download App:
  • android
  • ios