హస్తినలో సీఎం జగన్: పీఎంవో అధికారులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై జగన్ చర్చిస్తున్నారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీని సీఎం వైయస్ జగన్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ పీఎంవో కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు.
పీఎంవో కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శులతో జగన్ భేటీ అయ్యారు. పీఎంవో కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు కార్యదర్శి పీకే శర్మలతో సుమారు 40నిమిషాలపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై జగన్ చర్చిస్తున్నారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీని సీఎం వైయస్ జగన్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అలాగే పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసిన తర్వాత ఆయన లోక్ సభకు వెళ్లనున్నారు. లోక్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తొలుత మంగళవారం మధ్యాహ్నాం 2.30గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. అయితే లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కలిసేందుకు సమయం కుదరలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం అమిత్ షాతో భేటీ కానున్నారు.
రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, విభజన అంశాలు, ప్రత్యేకంగా ఏపీకి ఆర్థిక సాయంపై వారితో చర్చించినట్టు సమాచారం. ప్రధానితో భేటీలో నివేదించాల్సిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.
ఇకపోతే వివాదాస్పదమైన పోలవరం కాంట్రాక్టుల రీటెండరింగ్ అంశం, పీపీఏల రద్దు వంటి అంశాలపై వివరణ ఇస్తూ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం,విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనూ మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.