పాల దందాలో పాపాల భైరవుడు ఈ నయా వీరప్పన్..: మంత్రి పెద్దిరెడ్డిపై లోకేష్ ఫైర్
పాడి రైతులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తీవ్రంగా అన్యాయం చేస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
పాడి రైతులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తీవ్రంగా అన్యాయం చేస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో నయా వీరప్పన్ గా పేరుగాంచిన పెద్దిరెడ్డి మంత్రయ్యాక వైన్, మైన్, ల్యాండ్, సాండ్ మాఫియా కింగ్ అయ్యారన్నారు. చివరకు పాడి రైతులను దోచుకుంటూ పాపాల భైరవుడయ్యాడని లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ల గ్రామ పాడి రైతులును డబ్బులు ఎక్కువిచ్చినా ఇతర డెయిరీలకు పాలు పొయ్యకూడదని పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ సభ్యులు బెదిరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అయితే తాము పాలు పారబోస్తాం కానీ పాపాల భైరవుడు పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోయబోమంటోన్న రైతుల్ని ఏం చేస్తావు పాపాల భైరవా పెద్దిరెడ్డీ? అని లోకేష్ ప్రశ్నించారు. రైతులు రోడ్లపై పాలు బారబోస్తున్న వీడియోను లోకేష్ జతచేస్తూ ట్వీట్ చేసారు.