తప్పు చేయకుంటే భయమెందుకు... డ్రగ్స్ కేసు కొత్తదేం కాదు : రోహిత్ రెడ్డికి నోటీసులపై డీకే అరుణ
డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు కొత్తగా ఓపెన్ చేసింది కాదని... తప్పు చేయకుంటే నోటీసులు ఎందుకు వస్తాయని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసులో నోటీసులు ఇస్తే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఆ పార్టీ నేత డీకే అరుణ. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా డ్రగ్స్ కేసుపై చర్చ జరుగుతోందన్నారు. ఈ కేసు కొత్తగా ఓపెన్ చేసింది కాదని... తప్పు చేయకుంటే నోటీసులు ఎందుకు వస్తాయని డీకే అరుణ ప్రశ్నించారు. తప్పు చేయకుంటే ఎందుకు భయపడాలని ఆమె చురకలంటించారు.
ఇకపోతే... తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని రోహిత్ రెడ్డిని ఆ నోటీసులో పేర్కొన్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పదే పదే చెబుతున్నారు. ఈ తరుణంలో పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ కావడం చర్చకు దారి తీసింది. ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని పైటెల్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు.
ALso REad:తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు: ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశం
అయితే నోటీసులను చూడాల్సి ఉందన్నారు. ఏ కేసులో తనకు నోటీసులు ఇచ్చారో తెలియదని రోహిత్ రెడ్డి తెలిపారు.తన బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. మరో వైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా విచారణకు రావాలని కోరారు.
ఇదిలావుండగా... ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేస్తూ ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలనే వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.