Asianet News TeluguAsianet News Telugu

టెలికం ప్రొవైడర్లకు గట్టి ఎదురుదెబ్బ...1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందే...

ఏజీఆర్ చెల్లింపులపై సమీక్షా పిటిషన్లపై ఆశలు పెట్టుకున్న దేశీయ ప్రైవేట్ టెలికం ప్రొవైడర్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అక్టోబర్ 24వ తేదీన వెలువరించిన తీర్పునకు అనుగుణంగా ఈ నెల 23వ తేదీలోగా రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టేసింది. వాటికి విచారణ అర్హత లేనే లేదని తేల్చేసింది. 
 

no relief for telcos;they should pay 1.47 lakh crores
Author
Hyderabad, First Published Jan 17, 2020, 10:28 AM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో టెలికం ప్రొవైడర్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్ బకాయిలుగా ఉన్న రూ.1.47 లక్షల కోట్లు టెలికం శాఖకు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. టెలికం శాఖ నిర్వచించిన సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)ను గతేడాది అక్టోబర్‌ 24వ తేదీన సమర్థిస్తూ టెలికం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని సుప్రీం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నెల 23వ తేదీలోగా సొమ్మును జమ చేయాలనీ టెలికం సంస్థలకు గత అక్టోబర్ 24వ తేదీన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సంస్థలన్నీ కలిసి తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఎస్‌ఏ నజీర్‌, ఎంఆర్‌ షా నేతృత్వంలో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం కొట్టివేసింది. 

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి గల కారణాలు ఏమీ తమకు కనిపించడం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కాగా, తమ రివ్యూ పిటిషన్లపై ఓపెన్‌ కోర్టు విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంను టెల్కోలు కోరగా, దాన్ని కూడా తోసిపుచ్చుతూ ఇన్‌-చాంబర్‌ విచారణే జరిగింది.

also read హువావేతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ జట్టు.. మార్చిలో 5జీ ట్రయల్స్?

బకాయిలు, దానిపై వడ్డీ, జరిమానా, ఆపైనా వడ్డీల పేరుతో టెలికం శాఖకు రూ.1.47 లక్షల కోట్లు ఇవ్వాల్సిందిగా టెలికం సంస్థలను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన సంగతి విదితమే. టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గతంలో లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం కేంద్రానికి టెలికం సంస్థలు లైసెన్స్‌ ఫీజు బకాయిలుగా రూ.92,642 కోట్లను ఇవ్వాల్సి ఉన్నది. మరో రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలున్నాయి. 

అంతకుముందు సుప్రీం కోర్టులో దాఖలైన ఓ అఫిడవిట్‌ ప్రకారం ఎయిర్‌టెల్‌ రూ.35,586 కోట్లు, వొడాఫోన్‌ రూ.53,038 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456.47 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098.72 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.2,537.48 కోట్లు లైసెన్స్‌ ఫీజుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని టెలికం శాఖ తెలిపింది. మరికొన్ని సంస్థలూ బకాయిపడ్డాయి.

no relief for telcos;they should pay 1.47 lakh crores

సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ల కొట్టివేతపై భారతీ ఎయిర్‌టెల్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంలో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని పేర్కొన్నది. ‘సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. ఇదే సమయంలో మా అసంతృప్తిని తెలుపుతున్నాం. క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి గల అవకాశాలను అంచనా వేస్తున్నాం.

టెలికం పరిశ్రమ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నది. సుప్రీం తీర్పు మా కష్టాలను పెంచేసింది’ అని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వొడాఫోన్‌ ఐడియా సైతం క్యూరేటివ్‌ పిటిషన్‌పై యోచిస్తున్నది. ఈ మేరకు సంస్థ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా రుణ భారం రూ.1.17 లక్షల కోట్లుగా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుతో సంస్థ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. కాగా, ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. 

also read ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

తమ కన్జ్యూమర్‌ మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు టాటా టెలీసర్వీసెస్‌ అమ్మేసిన విషయం తెలిసిందే. టెలికం శాఖకు ఈ సంస్థ రూ.13,823 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇది కూడా ఇప్పుడు ఎయిర్‌టెల్‌ ఖాతాలోకే చేరింది. మొత్తం 15 సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఈ చెల్లింపులకున్న గడువు మరో వారం రోజులే. 

సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా.. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ.50,922 కోట్ల త్రైమాసిక నష్టాలను ప్రకటించగా, ఎయిర్‌టెల్‌ రూ.23,045 కోట్ల నష్టాలను ప్రకటించినది తెలిసిందే. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కాల్స్‌, డేటా చార్జీలనూ ఈ సంస్థలు పెంచినదీ విదితమే.

ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, ఆయిల్‌ ఇండియా తదితర కంపెనీల నుంచీ టెలికం శాఖకు సుమారు రూ.2.4 లక్షల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. తమ పైప్‌లైన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల వెంట ఆప్టిక్‌ ఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బాండ్‌ వర్తకానికి వీలుగా లైసెన్సులను పొందాయి. 

ఈ క్రమంలో టెలికం శాఖకు గెయిల్‌ రూ.1.72 లక్షల కోట్లు, పవర్‌గ్రిడ్‌ రూ.21 వేల కోట్లు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.40 వేల కోట్లు బకాయిపడ్డాయి. అయితే గెయిల్‌, పవర్‌గ్రిడ్‌లకు డిమాండ్‌ నోటీసులు పంపలేదని, మదింపు లేదా అంచనా ఆదేశాలను మాత్రమే జారీ చేశామని టెలికం శాఖ వర్గాలు చెబుతున్నాయి. రూ.15,097 కోట్ల బకాయి కోసం జీఎన్‌ఎఫ్‌సీకి టెలికం శాఖ డిమాండ్‌ నోటీసును పంపింది.

Follow Us:
Download App:
  • android
  • ios