Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఢిల్లీ యాత్ర.... ఎన్డీఏలో వైసీపీ నయా పాత్ర...?

వైసీపీని ఎన్డీఏ లో చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపెడుతున్నట్టు సమాచారం. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వైసీపీ గనుక ఎన్డీఏలో చేరితే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయోకూడా బీజేపీ పెద్దలు వైసీపీకి వివరించినట్టు సమాచారం. 

YSRCP chieh YS Jagan Delhi tour... YCP to join BJP led NDA ...?
Author
Amaravathi, First Published Feb 15, 2020, 1:58 PM IST

  ఈ  మధ్య జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్ మొదలు  నిన్నటి ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీ వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతుంది. 

దేశ ప్రజలంతా కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటును ముక్తకంఠంతో కోరుకుంటున్నప్పటికీ.... రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రజలు బీజేపీయేతర ప్రభుత్వాల ఏర్పాటుకు మొగ్గుచూపెడుతున్నారు. 

దీనివల్ల కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోతుందన్న సమస్య లేకున్నప్పటికీ.... బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి మాత్రం గండి పడే విధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎగువసభపై బీజేపీకి పూర్తి పట్టు లేదు. ఇక దేశ రాజకీయాల్లో ఈ ఫలితాలు తీసుకొచ్చిన పెను మార్పుల వల్ల నూతన రాజకీయసమీకరణాలు పొడిచే విధంగా మనకు కనబడుతున్నాయి. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నూతన రాజకీయ సమీకరణాలు పొడచూపే ఆస్కారం కూడా మనకు కనపడుతుంది. మొన్నటి వరకు అంటే...ఢిల్లీ ఎన్నికలు, మహారాష్ట్రలో శివసేన బీజేపీ మిత్రపక్షంగా ఉన్నంతవరకు కూడా, దేశ రాజకీయ సమీకరణలది ఒక లెక్క ఆతరువాత మరో లెక్క అన్నట్టుగా పరిస్థితులు మారాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గనుక తీసుకుంటే... మొన్నమొన్నటి వరకు కూడా బీజేపీకి టీడీపీ దగ్గరయింది, జనసేన కూడా అదే బాట పట్టింది కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిశాయని ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతాయని అంతా భావించారు. కాకపోతే... ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయి మనకు అర్థమవుతుంది.  

Also read: చంద్రబాబుకు చిక్కులు: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే...?

బీజేపీకి వరుసగా మిత్రులు దూరమైపోతున్నారు. శివసేన గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్, డీఎంకేల తరువాత 22 లోక్ సభ స్థానాలతో టీఎంసీ తో కలిసి మూడవ స్థానాన్ని పంచుకుంటుంది.  

లోక్ సభలో ఏకంగా 22మంది ఎంపీలతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలంతో మాత్రమే ఉంది.  కాకపోతే ఏప్రిల్ నాటికి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 

ఇందులో ఒక్క బెర్తు కూడా టీడీపీకి దక్కే ఆస్కారం లేదు. వైసీపీ తనకున్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో నలుగురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకొని ఆ సంఖ్యను 6కు పెంచుకోనుంది.  రాజ్యసభలో 6సీట్లు అంటే చిన్న విషయం కాదు. 

రాజ్యసభలో తగినంత బలం లేకపోవడం వల్ల బిల్లులు పాస్ చేయించడంలో కష్టాలు పడుతున్న బీజేపీకి వైసీపీని చేర్చుకుంటే బలం చేకూరుతుందని భావిస్తోందట. ఇది బీజేపీకి ఆశ పుట్టిస్తోంది . ఇలా రాజ్యసభలో బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ టీడీపీకి చెందిన 4గురు రాజ్యసభ సభ్యులను కూడా చేర్చుకుంది. 

ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఇంకొంతమంది మిత్రులు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. తెరాస ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించింది. రానున్న కాలంలో ఈశాన్య భారతంలో ఈ ఎఫెక్ట్ మనకు కనపడనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అవసరం బీజేపీకి ఖచ్చితంగా అవసరమొచ్చేలా మనకు కనపడుతుంది. 

అందుకోసమే వైసీపీని ఎన్డీఏ లో చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపెడుతున్నట్టు సమాచారం. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వైసీపీ గనుక ఎన్డీఏలో చేరితే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయోకూడా బీజేపీ పెద్దలు వైసీపీకి వివరించినట్టు సమాచారం. 

జగన్ ఎన్డీఏలో చేరుతారా...?

ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎన్డీఏలో చేరడానికి ప్రధానమైన అడ్డంకి ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఎవరు ప్రకటిస్తే వారికి మద్దతిస్తానని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. మరి కేంద్రం జగన్ పెట్టిన ఈ డిమాండ్ కు గనుక తలొగ్గితే... మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా అజెండాని పైకెత్తుకుని ప్రమాదం లేకపోలేదు. 

కాకపోతే ఏదో హామీలాగ ఇచ్చి, దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకుండా కాలయాపన చేసి టెక్నికల్ కారణాలను కూడా బీజేపీ చూపెట్టవచ్చు. కాకపోతే ఇలా ప్రకటన వచ్చిన వెంటనే బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవనెత్తుతాయి. 

ఈ పరిస్థితుల్లో బీజేపీ ఆ సాహసం చేస్తుందేమో చూడాలి. ఒకవేళ ఏపీ కి గనుక ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రాలకన్నా ముందుగా గళమెత్తేది తెరాస ప్రభుత్వమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే... పరిశ్రమలకు అక్కడ పన్ను మినహాయింపులు ఉంటాయి కాబట్టి అక్కడికి తరలి వెళ్లే ఆస్కారం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మిన్నకుండి కూర్చోదు. అందునా బీజేపీతో నేరుగా తలపడడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అందివచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. 

బీజేపీ గనుక ఈ ప్రకటన చేయకుండా వైసీపీ ఎన్డీఏలో చేరితే... ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలకు నూతన అస్త్రాన్ని జగన్ స్వయంగా అందించినట్టవుతుంది. కాబట్టి జగన్ ఇప్పుడు ఇస్తున్నట్టే బయటనుంచి బీజేపీకి అవసరమైన మద్దతు ఇవ్వాలని భావిస్తున్నాడు.

దానితోపాటు తనపై ఉన్న కేసులకు కూడా ఒక శాశ్వత పరిష్కారం దొరకాలంటే బీజేపీతో సఖ్యతగా ఉండడం మంచిదనే భావనలో జగన్ ఉన్నట్టు మనకు కనపడుతుంది. 

Also read; బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే...

కాకపోతే సిద్ధాంతపరంగా అత్యంత సన్నిహితమైన శివసేన పార్టీయే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరుణంలో వైసీపీ బయట నుంచి మద్దతు ఇస్తున్నప్పటికీ దానిని కన్ఫర్మ్ చేయాలంటే వైసీపీని భాగస్వామిగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. 

ఇన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో జగన్ బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ఎన్డీఏలో చేరతారా లేదా తనకు అత్యంత లాభదాయకమైన బయటనుంచి మద్దతు ఇచ్చే పద్ధతినే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇలా బొత్స వ్యాఖ్యలు చేయడం మరిన్ని ఊహాగానాలకు తెరలేపుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios