రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం ఇల్లీగల్ అని కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిమీద చట్టపరమైన కార్యాచరణ తీసుకొస్తామని ప్రకటించింది.
న్యూఢిల్లీ : రెస్టారెంట్లో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. అసోసియేషన్ ప్రతినిధులు, వినియోగదారుల సంఘాలతో గురువారం సమావేశం నిర్వహించిన తర్వాత వివరాలను వెల్లడించారు.
‘సర్వీస్ చార్జీలు వసూలు చేయడం చట్టబద్దమేనని అసోసియేషన్ లు పేర్కొన్నప్పటికీ వినియోగ వ్యవహారాల శాఖ అభిప్రాయం. అయితే.. వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తుంది. అంతేకాదు, అనుచిత విధానం కూడా. 2017 నాటి మార్గదర్శకాలు ఉన్నాయి కానీ, వాటిని అమలు చేయలేదు కనుక త్వరలోనే చట్టపరమైన కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతో చట్టప్రకారం అవి సర్వీస్ చార్జీ వసూలు నిలిపివేయాల్సి ఉంటుంది’ అని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. కస్టమర్ సర్వీస్ చార్జీని సర్వీస్ టాక్స్ గా పొరబడి చెల్లిస్తూ ఉంటారని వినియోగదారులు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ లేవనెత్తిన అంశాలపై తాజా సమావేశంలో కేంద్రం ప్రస్తావించింది.
చట్ట విరుద్ధం కాదు…‘ఇదే అంశం 2016 17లోనూ చర్చకు వచ్చింది. అప్పుడు అసోసియేషన్ తన స్పందన తెలిపింది. కాంపిటీషన్ కమిషన్ కు సైతం మా వాదనను సమర్థవంతంగా వినిపించాం’ అని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. ‘సర్వీసు చార్జీ చట్ట విరుద్ధం కాదు, అనుచిత విధానము కాదు. ప్రజా వేదికపై ఈ చర్చ అనవసర గందరగోళానికి దారితీస్తుంది. రెస్టారెంట్ల సాఫీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది’.. అని.. ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి పేర్కొన్నారు.
