- Home
- Telangana
- విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 17న కొందరు తెలంగాణ విమోచన దినోత్సవం, మరికొందరు విలీన దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ‘ప్రజాపాలన దినోత్సవం’ జరుపుతోంది. ఇలా జరపడానికి గల కారణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
Praja Palana Dinotsavam : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న 'ప్రజాపాలన దినోత్సవం' జరుపుతోంది... ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఎగరవేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ జెండా ఆవిష్కరణ చేపట్టారు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు... అంతకుముందు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. నిజాం రాజుల పాలననుండి హైదరాబాద్ సంస్థానం ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనం అయినరోజు సెప్టెంబర్ 17... అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది.
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాలను గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని... ఈ రోజు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు పడిన చారిత్రక సందర్భానికి గుర్తుగా నిలిచిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా 'ప్రజా పాలన దినోత్సవం' గా నిర్వహిస్తోందన్నారు.
తెలంగాణ పోరాటానికి ప్రత్యేక స్థానం : సీఎం రేవంత్
తెలంగాణ గడ్డపై అణచివేత, భూస్వామ్య వ్యవస్థ, వెట్టిచాకిరి, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజా చైతన్యం కొనసాగిందన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందని... అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందని గుర్తుచేశారు.
నిజాం పాలనలో హైదరాబాద్ నగరం పలు రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణచివేత వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవని సీఎం వివరించారు. రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు పోరాటాలు సాగించారని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభతో పాటు రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలువురు నాయకులు, యోధుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
ప్రజలే పాలనకు కేంద్రబిందువు
ప్రజా పాలన అంటే కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం కాదని.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, వారి హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ అందేలా చూడటం అని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా పాలన సాగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కేవలం గణాంకాల్లో కనిపించకుండా ప్రజల జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పారు. రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, యువతకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
రైతుల కోసం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేపట్టామని సీఎం తెలిపారు. రూ.20,616 కోట్లను విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందించినట్లు చెప్పారు.
వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 32 నెలల్లో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. భూ పరిపాలనలో మార్పుల కోసం భూ భారతి చట్టం, భూఆధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను తీసుకొచ్చామని, లక్షలాది మంది రైతులకు పట్టాదార్ పాస్బుక్స్ జారీ చేసినట్లు తెలిపారు.
మహిళా సాధికారతపై ఫోకస్
తెలంగాణలో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని సీఎం చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా మహిళలకు రూ.12 వేల కోట్లకు పైగా ప్రయాణ ఖర్చు ఆదా అయిందని తెలిపారు.
గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలను సీఎం వివరించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ రాయితీతో పాటు మహిళా మార్ట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల వంటి కార్యక్రమాల ద్వారా వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
పేదలకు ఇళ్లు, సామాజిక భద్రత
ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లోనూ పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కోట్లాది మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
విద్య, వైద్యం.. ప్రభుత్వ ప్రాధాన్యాలు
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు, విద్యార్థులకు అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
విద్యతో పాటు వైద్య రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, టిమ్స్ ఆసుపత్రుల అభివృద్ధి, వరంగల్లో 2 వేల పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి కార్యక్రమాలను వివరించారు.
యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ
తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ నియామకాలను చేపట్టామని సీఎం చెప్పారు. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తిచేశామని పేర్కొన్నారు. అధికారిక రాష్ట్ర వర్గాల ప్రకారం 2026లో ప్రభుత్వం 67,760 ఉద్యోగాల భర్తీని కూడా ప్రస్తావించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతికతల కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసం అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీతో ప్రపంచ స్థాయి అభివృద్ధి
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సీఎం వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీని దాదాపు 30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఈవీ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. టీసీఎస్–హైపర్వాల్ట్ ప్రాజెక్ట్ ద్వారా భారీ స్థాయిలో ఏఐ, డేటా సెంటర్ మౌలిక వసతులు ఏర్పడనున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అమెజాన్ డేటా సెంటర్ ప్రాజెక్టును కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలక పెట్టుబడిగా ప్రభుత్వం పేర్కొంది.
అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం
సామాజిక న్యాయాన్ని ప్రజా పాలనలో కీలక అంశంగా సీఎం పేర్కొన్నారు. కుల సర్వే ఆధారంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు పెంచే చర్యలు చేపట్టామని, ఎస్సీ వర్గీకరణను కూడా ప్రస్తావించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా సమాన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
చివరగా సెప్టెంబర్ 17 కేవలం గత చరిత్రను గుర్తుచేసుకునే రోజు మాత్రమే కాదని, భవిష్యత్తు బాధ్యతలను గుర్తుచేసే సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాటాల స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతు, మహిళ, పేదలు, యువత, వెనుకబడిన వర్గాల అభివృద్ధితో ఆధునిక తెలంగాణను నిర్మించడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Telangana Praja Palana Dinotsavam 2026 Celebrations at Public Gardens, Hyderabad https://t.co/H8R5sTx3Kp
— Telangana CMO (@TelanganaCMO) September 17, 2026

