- Home
- Sports
- IND vs PAK : రూ. 200 కోట్ల ఫైన్.. జట్టుపై బ్యాన్! భారత్తో పెట్టుకుంటే పాకిస్థాన్కు చుక్కలే
IND vs PAK : రూ. 200 కోట్ల ఫైన్.. జట్టుపై బ్యాన్! భారత్తో పెట్టుకుంటే పాకిస్థాన్కు చుక్కలే
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ సీరియస్ అయ్యింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పీసీబీపై కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించింది.

ఖేల్ ఖతం.. పాకిస్థాన్ క్రికెట్ క్లోజ్? ఐసీసీ సంచలన నిర్ణయం
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం రేగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన చిరకాల ప్రత్యర్థి భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం సంచలనంగా మారింది.
బంగ్లాదేశ్కు సపోర్టుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొంది. అయితే, ఈ మొండి వైఖరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అత్యంత కఠినంగా స్పందించింది. తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే పాకిస్థాన్పై శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉందని ఐసీసీ స్పష్టం చేసింది.
వివాదానికి అసలు కారణం ఇదే
ఈ వివాదం బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంతో మొదలైంది. భారత్లో జరగాల్సిన మ్యాచ్లకు భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, తగిన భద్రతా హామీలు ఉన్నాయని భావించిన ఐసీసీ, బంగ్లాదేశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
దీనికి నిరసనగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా, వారి స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ చేర్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్కు సంఘీభావం తెలుపుతూ పాక్ ప్రభుత్వం, తమ జట్టు కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే ఆడదని ప్రకటించింది.
పాకిస్థాన్పై ఐసీసీ ఆగ్రహం
పాకిస్థాన్ తీసుకున్న ఈ సెలెక్టివ్ పార్టిసిపేషన్ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఐసీసీ.. "ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లలో అన్ని జట్లు సమాన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. షెడ్యూల్ ప్రకారం ఆడేందుకు అర్హత సాధించిన ప్రతి జట్టుకు బాధ్యత ఉంటుంది. ఒక దేశం ఇలా ఎంపిక చేసిన మ్యాచ్లను బహిష్కరించడం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది." అని పేర్కొంది. జై షా నేతృత్వంలోని ఐసీసీ, పాకిస్థాన్కు 48 గంటల గడువు విధించినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ పై పడనున్న కఠిన ఆంక్షలు
ఒకవేళ పాకిస్థాన్ తన మొండి పట్టు వీడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది. ఐసీసీ పరిశీలిస్తున్న ప్రధాన ఆంక్షలు గమనిస్తే..
- పూర్తిస్థాయి నిషేధం: 1970లలో దక్షిణాఫ్రికాపై విధించిన తరహాలోనే, పాకిస్థాన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా బహిష్కరించడం.
- ఆర్థిక ఆంక్షలు: ఐసీసీ నుంచి పాకిస్థాన్కు అందే సుమారు 34.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 285 కోట్లు) వార్షిక ఆదాయాన్ని నిలిపివేయడం.
- పీఎస్ఎల్ (PSL) పై దెబ్బ: విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లను ఐసీసీ బ్లాక్ చేయడం.
- నష్టపరిహారం: బ్రాడ్కాస్టర్లకు కలిగే భారీ నష్టాన్ని (సుమారు రూ. 200 కోట్లు) పీసీబీ నుంచే వసూలు చేయడం.
ముగియనున్న పాక్ క్రికెట్ శకం?
ప్రస్తుతం సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకోవాల్సి ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో పాక్ తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 15 మ్యాచ్ విషయంలో పాక్ వెనక్కి తగ్గకపోతే, టోర్నీ నుంచి పాకిస్థాన్ను తప్పించి వారి స్థానంలో ఉగాండాను చేర్చే యోచనలో ఐసీసీ ఉంది.
ఇప్పటికే తెరవెనుక దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఐసీసీ మాత్రం తన నిబంధనల విషయంలో తగ్గేదే లేదని సంకేతాలిచ్చింది.

