- Home
- Entertainment
- Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Kannappa: మంచు విష్ణు, మంచు మోహన్ బాబు రూపొందించిన `కన్నప్ప` మూవీ గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

భారీ కాస్టింగ్తో రూపొంది సందడి చేసిన కన్నప్ప
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు రూపొందించిన చిత్రం `కన్నప్ప`. భక్త కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. ఇందులో మంచు విష్ణు, మోహన్ బాబుతోపాటు ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న విడుదలైంది.
కన్నప్ప టోటల్ కలెక్షన్లు
భారీ కాస్టింగ్తో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. సుమారు వంద కోట్లకుపైగానే బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణమైన కలెక్షన్లని వసూలు చేసింది. దాదాపు రూ.49కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ.25కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీకి రూ.80కోట్ల బిజినెస్గా లెక్కగట్టారు. కానీ అందులో సగం కూడా వసూలు చేయలేదు. దాదాపు రూ.56కోట్ల నష్టాలను మిగిల్చింది.
కన్నప్ప రీ రిలీజ్
ఇక బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ రూపొందించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సినిమా విడుదలై ఏడాది అవుతున్న సందర్భంగా దీన్ని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. `కన్నప్ప` సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్ను ఆడియెన్స్కి అందించబోతున్నాం. సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతోన్నామని మంచు విష్ణు వెల్లడించారు. మరి స్ట్రెయిట్ రిలీజ్ టైమ్లో నష్టాలను మిగిల్చిన ఈ మూవీ ఇప్పుడు ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి.

