- Home
- Business
- 7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్తో ఉద్యోగుల జీతాలు మారనున్నాయి. 7వ, 8వ పే కమిషన్ల మధ్య తేడాలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, హెచ్ఆర్ఏ, యూపీఎస్ పింఛన్ మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

7వ వేతన సంఘం vs 8వ వేతన సంఘం.. పూర్తి వివరాలు ఇవే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్కు, రాబోతున్న 8వ పే కమిషన్కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
కమిషన్ల ఏర్పాటు, రిపోర్టు సబ్మిట్ గడువు
7వ పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది.
కమిషన్ల సారథ్యం, అమలు తేదీలు
7వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్ ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్, బేసిక్ పే
జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది.
7వ పే కమిషన్లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్లో ఖరారయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి కనీస బేసిక్ పే రూ.34,560 నుంచి రూ.51,480 వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
డీఏ, హెచ్ఆర్ఏ లెక్కలు ఎలా మారుతాయి?
7వ పే కమిషన్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం కరవు భత్యం (DA) 60%కి చేరింది. 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చే సమయానికి డీఏను సున్నా (0%) చేస్తారు. పాత డీఏ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. 7వ పే కమిషన్లో డీఏ 50% దాటడంతో X, Y, Z కేటగిరీ నగరాల్లో HRA వరుసగా 30%, 20%, 10%గా మారింది. 8వ పే కమిషన్లో డీఏను బేసిక్ పేతో కలిపిన తర్వాత, హెచ్ఆర్ఏను మళ్లీ కొత్తగా లెక్కిస్తారు.
పింఛన్ విధానం, అమలు సమయం
7వ పే కమిషన్లో 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వర్తించింది. 8వ పే కమిషన్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఏకీకృత పింఛన్ పథకం (UPS), ఎన్పీఎస్ సంస్కరణలను చేర్చనున్నారు. 7వ పే కమిషన్లో కనీస పింఛన్ రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. 8వ పే కమిషన్లో పింఛనుదారులకు కూడా దామాషా ప్రకారం పెరుగుదల ఉంటుంది.
8వ పే కమిషన్ రిపోర్టు 2026-27లో వచ్చే అవకాశం ఉన్నందున, 2027 కంటే ముందు ఇది అమల్లోకి రావడం సాధ్యం కాదు. 7వ పే కమిషన్ ద్వారా 47 లక్షల మంది ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందగా, 8వ పే కమిషన్ వల్ల సుమారు 48.62 లక్షల మంది ఉద్యోగులు, 67.85 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు.

