- Home
- Andhra Pradesh
- Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఐఎండీ పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది.

బిగ్ అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా మారిన వాతావరణ పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ఒకేసారి యాక్టివ్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న అల్పపీడన వర్షాలకు తోడు, ఇప్పుడు తాజాగా తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు సిస్టమ్స్ ఒకేసారి ప్రభావం చూపుతుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ రానున్న రెండ్రోజులు వాతావరణం కూల్గా మారడంతో పాటు పలుచోట్ల వానలు దంచికొట్టే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వర్షాల అలర్ట్.. రాయలసీమ, కోస్తాలో వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో మంగళ, బుధవారాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి.
తెలంగాణలో రాత్రికి భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. పగటిపూట మధ్యాహ్నం వరకు తీవ్రమైన తేమ, ఉక్కపోతతో అసౌకర్యంగా ఉన్నప్పటికీ, సాయంత్రం నుంచి సీన్ పూర్తిగా మారిపోనుంది. మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ముఖ్యంగా జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాల సూచనతో వాతావరణ కేంద్రం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. గత 24 గంటల్లో సిద్దిపేట జిల్లా కొండపాకలో అత్యధికంగా 145.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లోనూ వర్షాలు
హైదరాబాద్ వాసులకు కూడా ఐఎండీ వర్షాల అలర్ట్ ఇచ్చింది. గత రెండు రోజులుగా నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. బేగంపేట, తిరుమలగిరి, బోయిన్పల్లి భారీ వర్షం పడింది. మారేడ్పల్లి, అల్వాల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు జలమయమయ్యాయి. ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు, ఒకట్రెండు సార్లు చాలా గట్టి జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
పిడుగులు పడే ప్రమాదం ఉంది
భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
• చెట్ల కింద నిలబడొద్దు: వర్షం పడుతున్నప్పుడు లేదా ఉరుములు వస్తున్నప్పుడు చెట్లు, కరెంట్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడకూడదు. పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
• ప్రయాణాలు వాయిదా వేసుకోండి: అత్యవసరమైతే తప్ప వర్షం తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.
• రైతులు, ప్రయాణికులు: లోతట్టు ప్రాంత ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర లోటు వర్షాభావం ఏర్పడి పంటలు ఎండిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాలు కొంతవరకు ఊరటనిస్తున్నప్పటికీ, ఈదురుగాలులు, పిడుగుల విషయంలో మాత్రం జనాలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

