- Home
- Andhra Pradesh
- ISRO: పది నిమిషాల్లో ప్రత్యర్థుల పని ఖతం.. ఇస్రో సరికొత్త సీక్రెట్ శాటిలైట్ సక్సెస్.. GSLV F17 ఉపయోగాలు ఏంటో తెలుసా?
ISRO: పది నిమిషాల్లో ప్రత్యర్థుల పని ఖతం.. ఇస్రో సరికొత్త సీక్రెట్ శాటిలైట్ సక్సెస్.. GSLV F17 ఉపయోగాలు ఏంటో తెలుసా?
ISRO Launches GSLV F17 : శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం సక్సెస్ అయింది. EOS-05 ఉపగ్రహం ద్వారా రక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయ రంగాల్లో సరికొత్త విప్లవం రానుంది. దీని ఉపయోగాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నింగిలోకి దూసుకెళ్లిన నాటీ బాయ్: ఇస్రో ఖాతాలో మరో మైండ్ బ్లాస్టింగ్ విక్టరీ
స్పేస్ రేస్లో ఇండియా స్పీడ్ అసలు తగ్గడం లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో 'నాటీ బాయ్' అని పిలిపించుకున్న జీఎస్ఎల్వీ రాకెట్, ఈసారి పక్కా ప్లానింగ్తో దుమ్మురేపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) రెండో ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు GSLV-F17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,367 కిలోల బరువున్న అత్యంత భారీ 'EOS-05' (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్)ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం ప్రారంభమైన సరిగ్గా 18 నిమిషాల్లోనే శాటిలైట్ నిర్ణీత సబ్-జీటీఓ కక్ష్యలోకి చేరడంతో సైంటిస్టులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
వాన పడుతున్నా తగ్గేదేలే
ఈ ప్రయోగాన్ని లైవ్గా చూడటానికి దేశం నలుమూలల నుంచి దాదాపు 1,500 మందికి పైగా సందర్శకులు శ్రీహరికోటలోని లాంచ్ వ్యూ గ్యాలరీకి చేరుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ, ఎవరూ వెనక్కి తగ్గలేదు. వర్షంలో తడుస్తూనే, రాకెట్ నింగిలోకి దూసుకెళ్తూ ఆకాశాన్ని చీల్చిన అద్భుత ఘట్టాన్ని చూసి కేరింతలు కొట్టారు. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ప్రయోగం, జీఎస్ఎల్వీ సిరీస్లో 19వది కావడం గమనార్హం.
అంతరిక్షంలో భారత్ ‘ఐ ఇన్ ది స్కై’: ఈఓఎస్-05 అసలు మాస్ పవర్ ఇదే
ఈ ప్రయోగం వల్ల దేశానికి వచ్చే ఉపయోగాలు మామూలుగా లేవు. EOS-05 అనేది ఒక నెక్స్ట్-లెవెల్ భూ పరిశీలన ఉపగ్రహం. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింక్రోనస్ ఆర్బిట్ లో స్థిరపడే తొలి భారతీయ ఇమేజింగ్ శాటిలైట్ ఇది.
రక్షణ రంగంలో విప్లవం: సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్లు ఒకే ప్రాంతాన్ని ఫొటో తీయడానికి రోజులు లేదా వారాల సమయం తీసుకుంటాయి. కానీ EOS-05 అలా కాదు.. భూస్థిర కక్ష్యలో ఉంటూ మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్లో కవర్ చేస్తుంది. ప్రతీ 10 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే హై-రిజల్యూషన్ చిత్రాలను పంపుతుంది. అవసరమైతే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఫొటోలు తీసి సరిహద్దుల్లో శత్రువుల కదలికలను రియల్ టైమ్లో పసిగడుతుంది.
విపత్తుల ముందస్తు అలర్ట్: వరదలు, సైక్లోన్లు, కొండచరియలు విరిగిపడటం, కార్చిచ్చు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో సమాచారం అందిస్తుంది. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇది సూపర్ గైడ్లా పనిచేస్తుంది.
వ్యవసాయం, పర్యావరణం: పంటల ఆరోగ్యం, భూమిలో తేమ శాతాన్ని, సాగు విస్తీర్ణాన్ని కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి వనరుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
స్వదేశీ సాంకేతికత.. నాటీ బాయ్ కథ ఇదే
జీఎస్ఎల్వీ సిరీస్లోని తొలి ప్రయోగాల్లో కొన్ని ఎదురుదెబ్బలు తగలడంతో శాస్త్రవేత్తలు దీన్ని సరదాగా 'నాటీ బాయ్' అని పిలిచేవారు. ముఖ్యంగా 2021లో జీశాట్-1 ప్రయోగంలో ఎదురైన సాంకేతిక సమస్యను మైండ్లో పెట్టుకుని, ఈసారి ఇస్రో సైంటిస్టులు పూర్తి స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను మరింత పర్ఫెక్ట్గా రీ-డిజైన్ చేశారు. రాకెట్ అంచనాలకు మించి పనిచేసి శాటిలైట్ను 171 కి.మీ x 31,026 కి.మీ కక్ష్యలోకి చేర్చిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ వెల్లడించారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని సొంత ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా దానిని 36,000 కి.మీ కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఈ శాటిలైట్ ఆయుష్షు దాదాపు 7 సంవత్సరాలకు పైగానే ఉండనుంది.
నెక్స్ట్ టార్గెట్ గగన్యాన్: ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే
ఈ విజయంపై కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. పిఎం మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్పేస్ పవర్గా మారుతోందని కొనియాడారు. ఇదే జోష్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే NVS-03 నావిగేషన్ శాటిలైట్తో పాటు మరో ఆరు కీలక ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. ఇందులో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'గగన్యాన్' తొలి మానవరహిత మిషన్ కూడా ఉంది. వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా ఇస్రో అడుగులు వేస్తోంది.

