Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026 ప్రసంగంలో విశాఖపట్నం పేరే వినిపించలేదు. కానీ ఈ బడ్జెట్ వల్ల వైజాగ్ రూపరేఖలే మారిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఇదే అంటున్నారు.

వైజాగ్ రూపురేఖలే మారిపోనున్నాయి...
Visakhapatnam : ఎన్డిఏ కూటమిలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే.. ఇంకా చెప్పాలంటే ఈ పార్టీ సపోర్ట్ లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కు ఈ బడ్జెట్ 2026 లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అందరూ భావించారు... కానీ అలా జరగలేదు. అయితే నేరుగా నిధులు ఇవ్వకున్నా బడ్జెట్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాల ద్వారా ఏపీకి భారీ లాభం జరగనున్నట్లు తెలుస్తోంది.
డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే... వైజాగ్ కు మహర్దశ
భాతర దేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సిద్దమయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కూడా పూర్తయ్యింది... భూకేటాయింపులు, ఇతర అనుమతులు కూడా పూర్తయ్యాయి.
ఇక రిలయన్స్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తుండటంతో రాబోయే కొన్నేళ్లలో విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారనుంది. భారీ పెట్టుబడితో లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విశాఖ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం విశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను రాయితీలు కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు తరలిరానున్నాయి. కాబట్టి ఈ నగరం ఐటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ రంగాల్లో మరింత దూసుకుపోనుంది.
ట్యాక్స్ మినహాయింపుతో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖకు తరలివచ్చే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతోంది... విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీంతో విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు రియల్ ఎస్టేట్ కూడా మరింత ఊపందుకోనుంది.
చంద్రబాబు కామెంట్స్..
డేటా సెంటర్లకు పన్ను రాయితీలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇండియా డేటా సెంటర్ హబ్ గా మారుతుందని... ఇప్పటికే విశాఖకు 10 గిగావాట్ కెపాసిటీ డేటాసెంటర్స్ ఏర్పాటుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుమతుల విషయం ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు.
అయితే ఒక్కసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది... ఇది గేమ్ చేంజర్ గా మారనుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే త్వరలోనే వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగాా ఉంటుందని... బెస్ట్ ఏఐ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.
డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ ఇస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.
విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. #UnionBudget2026#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/J1NdGAZSkl— Telugu Desam Party (@JaiTDP) February 2, 2026
డేటా సెంటర్లకు రాయితీతో హైదరాబాద్ కు లాభమే...
బడ్జెట్ లో డేటా సెంటర్లకు రాయితీలు ఇస్తామన్న కేంద్రం ప్రకటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూడా ఎంతో మేలు చేయనుంది. ఇప్పటికే నగరంలో 26 డేటా సెంటర్లు ఉన్నాయి... వీటికి పన్ను మినహాయింపుతో చాలా ప్రయోజనాలుంటాయి. తద్వారా ఆయా కంపెనీలు డేటా సెంటర్ల విస్తరణ, కొత్తవాటి ఏర్పాటుకు ముందుకువస్తాయి... దీంతో నగరంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే ఐటీ రంగంలో టాప్ లేపుతున్న హైదరాబాద్ భవిష్యత్ లో మరింత దూసుకుపోనుంది.

