- Home
- Andhra Pradesh
- Thalliki Vandanam: తల్లికి వందనం రూ.13,000 డబ్బులు ఇంకా పడలేదా? నో టెన్షన్.. ఇలా చేయండి
Thalliki Vandanam: తల్లికి వందనం రూ.13,000 డబ్బులు ఇంకా పడలేదా? నో టెన్షన్.. ఇలా చేయండి
Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' నిధులను విడుదల చేసింది. మీ ఖాతాలో రూ.13,000 పడ్డాయో లేదో మొబైల్లోనే సులువుగా ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే, మనీ పడకపోతే ఏం చేయాలో చూద్దాం.

తల్లికి వందనం డబ్బులు పడలేదా? వెంటనే ఈ చిన్న పని చేయండి
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రతి అర్హుడైన విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది.
ఈ ప్రక్రియ జూలై 22 నుంచి జూలై 24 వరకు విడతల వారీగా జరగనుంది. ఈ ఏడాది 42.70 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.10,120.78 కోట్ల నిధులను నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేస్తున్నారు. గతంలో లాగా ఇంట్లో ఒకరికే పరిమితం కాకుండా.. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం విశేషం.
ఆన్లైన్, యాప్లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. మీరు ఇంట్లో నుంచే స్మార్ట్ఫోన్ ద్వారా నిమిషాల్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
• లిప్ యాప్ (LIP App) ద్వారా: మొబైల్లో లిప్ యాప్ ఓపెన్ చేసి 'పేరెంట్ లాగిన్' ద్వారా సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ ఉన్న 'తల్లికి వందనం స్టేటస్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే నగదు క్రెడిట్ అయిందో లేదో వివరాలు కనిపిస్తాయి.
• ఆన్లైన్ పోర్టల్ ద్వారా:
- ముందుగా bm-sgsw.ap.gov.in/BM/ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
- 'Scheme Eligibility Check' ఆప్షన్ ఎంచుకోవాలి.
- విద్యార్థి లేదా తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'తల్లికి వందనం' స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇయర్ కేటగిరీలో '2026-27' ఎంచుకుని, ఆధార్కు లింక్ అయిన మొబైల్ ఓటీపీ, క్యాప్చా ఎంటర్ చేస్తే మీ ఎలిజిబిలిటీ స్టేటస్ పూర్తి డీటైల్స్తో స్క్రీన్పై కనిపిస్తుంది.
డబ్బులు పడలేదా? వెంటనే ఈ రెండు పనులు చేయండి
ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు పడకపోయినా లేదా అర్హత ఉండి కూడా లిస్టులో పేరు లేకపోయినా అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. ముందుగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఎన్పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్గా ఉందో లేదో సరిచూసుకోండి. ఈ రెండు సాంకేతిక లోపాల వల్లే ఎక్కువ మందికి నగదు జమ కాకుండా ఆగిపోతుంది. వెంటనే మీ సమీప గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడి వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించండి. మీ వివరాలను రీ-వెరిఫై చేసి, దరఖాస్తును సరిచేసి మళ్లీ ప్రాసెస్ చేస్తారు. వచ్చే నెల వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంది.
తల్లికి వందనం అర్హత నిబంధనలు ఇవే
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది.
• హాజరు: విద్యార్థికి తప్పనిసరిగా 75% వార్షిక హాజరు ఉండాలి.
• ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలలోపు ఉండాలి.
• ఇతర అర్హతలు: కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం, సొంత కార్లు మొదలైనవి ఉండకూడదు. భూమి 10 ఎకరాల లోపు ఉండాలి, విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.
• పథకం కింద కేటాయించిన రూ.15,000 లలో పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ కోసం రూ.2,000 కలెక్టర్ అకౌంట్కు వెళ్తుండగా, నికరంగా రూ.13,000 తల్లి అకౌంట్లో జమ అవుతాయి. ఈ విద్యాసంవత్సరం 1వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న నిధులు విడుదల కానున్నాయి.
అలర్ట్: ఫేక్ లింకులు క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ
'తల్లికి వందనం' నిధుల విడుదల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభించే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. "మీకు తల్లికి వందనం రూ.13,000 జమ అయ్యాయి.. ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి" అని వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్లలో వచ్చే నకిలీ లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, ఆధార్ నంబర్లు చెప్పకూడదు. అధికారిక వెబ్సైట్ లేదా సచివాలయం ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

